నేడు బంద్
ABN , First Publish Date - 2021-03-05T06:46:33+05:30 IST
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం రాష్ట్ర బంద్కు ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది.
ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు
ఉక్కుటౌన్షిప్, మార్చి 4: స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం రాష్ట్ర బంద్కు ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపునిచ్చింది. బంద్కు ఇప్పటికే వైసీపీ, తెలుగుదేశం, జనసేన, సీపీఐ, సీపీఎం, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ పూర్తిగా నిలిచిపోనున్నాయి. విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ కూడా మూతబడనున్నాయి. బంద్కు మద్దతుగా ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బస్సులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బంద్లో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, అధికారులు, వ్యాపార వర్గాలు పాల్గొని జయప్రదం చేయాలని పోరాట కమిటీ చైర్మన్లు సీహెచ్ నరసింగరావు, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, కన్వీనర్ జె.అయోధ్యరాం, కో-కన్వీనర్ గంధం వెంకటరావు, కేఎస్ఎన్ రావు కోరారు.
ఉద్యోగులు ఆధ్వర్యంలో..
రాష్ట్ర బంద్లో భాగంగా స్టీల్ప్లాంట్ ఉద్యోగులు తగరపువలస నుంచి తుని వరకు గల అనేక ప్రాంతాల్లో తమ నిరసనను తెలియజేయనున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన పరిణామాలు, ప్రైవేటుపరం చేయడం వల్ల తలెత్తే ఇబ్బందులు వంటి అంశాలను ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఉద్యోగులు వివరించి తమ ఆందోళనలకు ప్రజల మద్దతును కూడగట్టనున్నారు.