అరకులోయలో ప్లాస్టిక్పై నిషేదం
ABN , First Publish Date - 2022-03-17T02:43:17+05:30 IST
పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ను నిషేధించడానికి పెదలబుడు పంచాయతీ నడుంబించింది.
విశాఖ: పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్ను నిషేధించడానికి పెదలబుడు పంచాయతీ నడుంబించింది. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో ప్లాస్టిక్ను నిషేధిస్తూ వర్తక సంఘాల ప్రతినిధులతో పెదలబుడు పంచాయతీ తీర్మానం చేసింది. అరకులోయలో విరివిగా ప్లాస్టిక్ను వినియోగిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీ తీర్మానాన్ని ఉల్లంఘించిన వారిపై దశల వారీగా రూ. 10 వేలు నుంచి 50 వేల రూపాయల వరకు జరిమానా విధిస్తామని ప్రకటించారు. ప్లాస్టిక్ రహితంగా అందాల అరకులోయను తీర్చిదిద్దాలని పంచాయతీ సర్పంచ్ పెట్టెలి దాసుబాబు పిలుపునిచ్చారు.
గతంలో పట్టణాల్లో మాత్రమే ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పల్లెల్లో కూడా టీ దుకాణాలు, పండ్ల బండ్ల వారు, కిరాణ దుకాణదారులు కూడా ప్లాస్టిక్ సంచులను వినియోగదారులకు ఇస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. మనం పీల్చే గాలిలో కూడా మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. ప్లాస్టిక్ అత్యంత చౌకగా అందరికీ అందుబాటులోకి రావడం దీని వినియోగం పెరిగింది. అయితే ప్లాస్టిక్ విష పూరితము కాదు. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల వలన పర్యావరణానికి కలిగే ముప్పు అంతా ఇంతా కాదు.