కరోనా ఎఫెక్ట్... నాగాలాండ్లో కుక్క మాంసం నిషేధం
ABN , First Publish Date - 2020-07-05T23:07:24+05:30 IST
కరోనా ఎఫెక్ట్... నాగాలాండ్లో కుక్క మాంసం నిషేధం
కోహిమా : కరోనా నేపధ్యంలో నాగాలాండ్ లో కుక్క మాంసాన్ని నిషేధించారు. ఇతర రాష్ట్రాల్లో మేకలను, కోళ్ళను ఎలా తింటారో... నాగాలాండ్లో కుక్క మాంసాన్ని అంత ప్రీతిగా భుజిస్తారు. అయితే... దేశవ్యాప్తంగా కరోనా మహమ్మరి రోజురోజుకు ఉధృతంగా వ్యాపిస్తుండడంతో వివిధ రాష్ట్రాలు ఆయా అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే నాగాలాండ్ లో కుక్క మాంసంపై నిషిధం విధించారు. దీంతో... ఇకపై కుక్క మాంసం దిగుమతులు, ఎగుమతులు ఉండబోవు. వ్యాపారముండదు. అయితే ఈ నిర్ణయాన్ని నాగాలాండ్ ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. కుక్క మాంసాన్ని తినడం శతాబ్దాలుగా వస్తోన్న ఆచారమని, ఒక రకంగా అది ప్రజల సాప్రదాయమని చెబుతున్నారు. దానిని రద్దు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆచారవ్యవహారాలను కాలదన్నే అధికారం ప్రభుత్వాలకుండబోదని తెగేసి చెబుతున్నారు.
కుక్క మాంసంపై ఇప్పటికే మిజోరం రాష్ట్రంలోనిషేధం అమల్లో ఉంది. అయితే కుక్క మాంసం నిషేధంపై జంతు ప్రేమికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కుక్క మాంసం నిషేధాన్ని నిరసిస్తూ త్వరలో ఓ ఉద్యమాన్ని చేపట్టాలని నాగాలాండ్ లోని కొన్ని ప్రజా సంఘాలు యోచిస్తుండడం గమనార్హం.
కాగా కొద్ది నెలల క్రితం చెన్నైలో కుక్క మాంసం కలకలం సృష్టించిన విషయం విదితమే. రాజస్తాన్ నుంచి రవాణా అవుతున్న వెయ్యి కిలోల కుక్క మాంసాన్ని అధికారులు చెన్నై శివార్లలో పట్టుకున్నారు. చెన్నైలోని కొన్ని హోటళ్ళలో బిర్యానీ తయారీలో భాగంగా కుక్క మాంసాన్ని కూడా వినియోగిస్తున్నారంటూ ఆ సందర్భంలో పెద్దఎత్తున విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి నాగాలాండ్లో పునరావృత్తమవుతోంది.