నేటి నుంచి మాంసం విక్రయాలపై నిషేధం
ABN , First Publish Date - 2021-05-14T06:04:05+05:30 IST
మంగళగిరి-తాడేపల్లి నగరపాలకసంస్థ పరిధిలో శుక్రవారం నుంచి అన్ని రకాల మాంసం విక్రయాలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ఎంటీఎంసీ అదనపు కమిషనరు కే.హేమమాలినీరెడ్డి ప్రకటించారు.
ఎంటీఎంసీ అదనపు కమిషనరు కే.హేమమాలినీరెడ్డి
మంగళగిరి, మే 13: మంగళగిరి-తాడేపల్లి నగరపాలకసంస్థ పరిధిలో శుక్రవారం నుంచి అన్ని రకాల మాంసం విక్రయాలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు ఎంటీఎంసీ అదనపు కమిషనరు కే.హేమమాలినీరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు గురువారం మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా నగరంలో కరోనా వ్యాప్తి విస్తృతి ఎక్కువగా వున్న కారణంగా మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నామన్నారు. శుక్రవారం నుంచి నగర పరిధిలో చికెన్ స్టాల్స్, మటన్, చేపల మార్కెట్లు మూసివేయాలన్నారు. అలాగే కొందరు చిరువ్యాపారులు బైపాస్ రోడ్డు, తెనాలి రోడ్డు వెంబడి చేపలు, రొయ్యల విక్రయాలు చేస్తున్నారని...వారు కూడ తమతమ విక్రయాలను నిలిపివేయాలన్నారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు మాంసం విక్రయాలపై ఈ నిషేధం కొనసాగుతుందని హేమమాలినీరెడ్డి తెలిపారు. ఎవరైనా ఉత్తర్వులను ఉల్లంఘించి విక్రయాలను జరిపినట్టయితే వారిపై కోవిడ్ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.