ఆ బంతికి కోహ్లీనే కాదు.. ఎవరైనా పెవిలియన్ చేరాల్సిందే: జెమీసన్

ABN , First Publish Date - 2021-06-21T21:41:16+05:30 IST

భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో చెలరేగిన కివీస్ బౌలర్ కైల్ జెమీసన్ రికార్డులు కొల్లగొడుతున్నాడు.

ఆ బంతికి కోహ్లీనే కాదు.. ఎవరైనా పెవిలియన్ చేరాల్సిందే: జెమీసన్

సౌతాంప్టన్: భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో చెలరేగిన కివీస్ బౌలర్ కైల్ జెమీసన్ రికార్డులు కొల్లగొడుతున్నాడు. అతడి దెబ్బకు ఇండియా తొలి ఇన్సింగ్స్‌లో 217 పరుగులకే కుప్పకూలింది. జెమీసన్ 31 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు నేలకూల్చాడు. మొత్తంగా 22 ఓవర్లు వేసిన జెమీసన్ అందులో 12 ఓవర్లను మెయిడెన్ చేయడం గమనార్హం. జెమీసన్ పడగొట్టిన ఐదు వికెట్లలో కోహ్లీ వికెట్ కూడా ఉంది. అప్పటి వరకు ఔట్ స్వింగర్లను సమర్థంగా ఎదుర్కొన్న కోహ్లీ.. జెమీసన్ వేసిన ఇన్ స్వింగర్‌ను ఎదుర్కోవడంలో తడబడి వికెట్ల ముందు దొరికిపోయాడు.  



మ్యాచ్ అనంతరం జరిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కోహ్లీ ఔట్‌పై జెమీసన్ మాట్లాడుతూ.. ఆ బంతికి కోహ్లీ కాదు కదా.. క్రీజులో ఎవరున్నా ఔటయ్యే వారని అన్నాడు. గతంలో న్యూజిలాండ్‌లో ఆడినప్పుడు కోహ్లీపై ప్రయోగించిన అస్త్రాన్నే ఇప్పుడూ ఆ జట్టు ప్రయోగించింది. ఇదే విషయాన్ని అతడికి గుర్తు చేసినప్పుడు బహుశా ఇదే వ్యూహం ఉందని భావిస్తున్నట్టు చెప్పాడు.


విరాట్‌కు బ్యాకప్ లెంగ్త్‌గా విసిరిని బంతిని ఎలాంటి బ్యాట్స్‌మెన్‌కు అయినా ఆడడం కష్టమేనని అన్నాడు. ఈ బంతిని నియంత్రించడం బౌలర్‌కు, దానిని మెరుగ్గా ఆడడం ఎలాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌కు అయినా కష్టమేనని జెమీసన్ చెప్పుకొచ్చాడు. కోహ్లీని అంత ఔట్ చేయడం అంత సులభం కాదని, కానీ ఉదయాన్నే అతడి వికెట్ దక్కడం బోల్డంత ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.

Updated Date - 2021-06-21T21:41:16+05:30 IST