శాంతి భద్రతలు మెరుగుపరచాలంటూ 12 గంటల బంద్
ABN , First Publish Date - 2022-06-16T21:26:11+05:30 IST
బాలాసోర్: ఒడిశా బాలాసోర్ జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించడాన్ని నిరసిస్తూ పలు సంస్థలు, రాజకీయ పార్టీలు 12 గంటల బంద్కు పిలుపునిచ్చాయి.
బాలాసోర్: ఒడిశా బాలాసోర్ జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించడాన్ని నిరసిస్తూ పలు సంస్థలు, రాజకీయ పార్టీలు 12 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు వరకూ బంద్ నిర్వహిస్తున్నారు. దుకాణాలు, మార్కెట్లు, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయించారు. నిరసనకారులు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ రహదారులపై ఆందోళనకు దిగారు. రహదారుల దిగ్బంధనంతో వాహనాలు నిలిచిపోయాయి. తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ నిర్వహిస్తోన్న ఈ బంద్కు అనేక సామాజిక సంస్థలు మద్దతిచ్చాయి.
బాలాసోర్ జిల్లాలో దోపిడీలు, హత్యలు, డ్రగ్స్ మాఫియా, చైన్ స్నాచింగ్ ఘటనలు పెరిగిపోయాయి. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణిస్తున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ఆరోపించారు. తక్షణమే శాంతి భద్రతలు మెరుగుపరచాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.