శ్రమించే రైతన్నలతో అనుబంధంగల పండుగ బైశాఖి : మోదీ
ABN , First Publish Date - 2021-04-13T19:02:26+05:30 IST
సిక్కుల నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా జరుపుకునే బైశాఖి పండుగకు ఆరుగాలం
న్యూఢిల్లీ : సిక్కుల నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా జరుపుకునే బైశాఖి పండుగకు ఆరుగాలం శ్రమించే రైతన్నలతో, ప్రకృతితో అనుబంధం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బైశాఖి సందర్భంగా ప్రజలందరికీ ఆయన మంగళవారం ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత పవిత్రమైన బైశాఖి పండుగ అందరి జీవితాల్లోనూ సంతోషం, సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
బైశాఖి పండుగకు ప్రకృతితో, ఆరుగాలం శ్రమించే రైతన్నలతో అనుబంధం ఉందని చెప్పారు. సాగు భూములు పంటలతో వర్ధిల్లాలని, మన భూమండలాన్ని కాపాడుకునేందుకు మనల్ని ప్రేరేపించాలని ఆకాంక్షించారు.
బైశాఖి అనేది సిక్కుల నూతన సంవత్సర ప్రారంభ దినం. అంతేకాకుండా 1699లో గురు గోబింద్ సింగ్ ఖల్సా పంత్ను ఏర్పాటు చేసిన రోజు కూడా ఇదే. ఈ పండుగను పంజాబ్, ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. పంజాబ్లోని చండీగఢ్లో గురుద్వారాల్లో కోవిడ్-19 ఆంక్షలను అమలు చేస్తున్నారు. మాస్క్ ధరించనివారిని గురుద్వారాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.