దేవిరెడ్డి, గజ్జల, సునీల్‌ బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత

ABN , First Publish Date - 2022-08-02T09:46:00+05:30 IST

వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్‌ యాదవ్‌(ఏ2) గజ్జల ఉమాశంకర్‌రెడ్డి(ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(ఏ5)కి హైకోర్టులో చుక్కెదురైంది.

దేవిరెడ్డి, గజ్జల, సునీల్‌ బెయిల్‌ పిటిషన్లు కొట్టివేత

  • వారిపై తీవ్రమైన ఆరోపణలు
  • గత చరిత్ర అంతా నేరపూరితం
  • బెయిల్‌ ఇవ్వలేం: న్యాయమూర్తి
  • వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులకు చుక్కెదురు 


అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్‌ యాదవ్‌(ఏ2) గజ్జల ఉమాశంకర్‌రెడ్డి(ఏ3), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి(ఏ5)కి హైకోర్టులో చుక్కెదురైంది. తాజాగా వారు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్‌ ఇచ్చేందుకు నిందితులు కస్టడీలో గడిపిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, అదే సమయంలో వారికి ఉన్న నేరచరిత్ర, కేసుకి సంబంధించిన మొత్తం పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛ వెలకట్టలేనిది అయినప్పటికీ బెయిల్‌ ఇచ్చే సమయంలో కోర్టు ముందు ఉన్న ఆధారాలు, కేసు పూర్వాపరాలు, నిందితులపై ఉన్న తీవ్రమైన ఆరోపణలు విస్మరించకూడదని అభిప్రాయపడింది. హత్యకేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గతంలో దిగువ కోర్టు, హైకోర్టు బెయిల్‌ పిటిషన్లు కొట్టివేశాయని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత బెయిల్‌ పిటిషన్లు పరిగణనలోకి తీసుకొనేందుకు తాజా  కారణాలు ఏమీ లేవని పేర్కొంది. దిగువ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేయడాన్ని చేంజ్‌ ఆఫ్‌ సర్కమ్‌స్టెన్స్‌గా పరిగణించడానికి వీల్లేదన్న సీబీఐ వాదనలతో ఏకీభవించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి. రమేశ్‌ సోమవారం తీర్పు వెలువరించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా  ఉన్న సునీల్‌, గజ్జల, దేవిరెడ్డిలను సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 


సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉండడంతో పాటు కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్‌ ఇవ్వలేమని స్పష్టం చేస్తూ వీరు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌న్లను హైకోర్టు గతంలో కొట్టివేసింది. దీంతో తాజాగా మరోసారి వారు బెయిల్‌ కోసం పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పు రిజర్వ్‌ చేశారు. సోమవారం తన నిర్ణయాన్ని వెల్లడించారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సీనియర్‌ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి, కె. చిదంబరం, న్యాయవాది టీఎల్‌ నయన్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ‘‘హత్య అనంతరం  జరిగిన పరిణామాలను దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఆపాదిస్తున్నారు. సీబీఐ దర్యాప్తు అధికారి డ్రైవర్‌ను బెదిరించారనే ఫిర్యాదులో వాస్తవం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. జరిగిన ప్రతి ఘటనను దేవిరెడ్డికి ఆపాదించడం సరికాదు. పిటిషనర్‌పై గతంలో నమోదైన కేసులన్నీ రాజీకీయ ప్రూరేపితమే. దేవిరెడ్డి విషయంలో సీబీఐ దర్యాప్తు ముగిసింది. ఇప్పటికే రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. నేరాన్ని నిరూపించేందుకు దస్తగిరి సాక్ష్యమే ఆధారమని సీబీఐ తన అఫిడవిట్‌లో ఎక్కడా పేర్కొనలేదు. పిటిషనర్‌ హత్యలో భాగస్వామి అయినట్లు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా ఇతర ఏ సాక్ష్యం లేదు. గత ఆరునెలలుగా పిటిషనర్లు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. హత్య కేసులో ఏ1గా ఉన్న గంగిరెడ్డితో పాటు ఏ4గా ఉన్న దస్తగిరి ప్రస్తుతం బెయిల్‌ మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లను కస్టడీలో కొనసాగించడం సరికాదు. బెయిల్‌ మంజూరు చేయండి’’ అని అభ్యర్థించారు. 


సాక్షులను ప్రభావితం చేస్తున్నారు: సీబీఐ

సీబీఐ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘‘దేవిరెడ్డి తాత్కాలిక అనుమతితో బయటకు వచ్చిన ప్రతిసారీ రాజకీయ నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. వాంగ్మూలం ఇచ్చేందుకు ముందుకు వచ్చినవారు కూడా తర్వాత సీబీఐకి సహకరించడం లేదు. దేవిరెడ్డికి నేరచరిత్ర ఉంది. అతనిపై మొత్తం 31 కేసులు ఉన్నాయి. వాటిలో 302, 301, 354 వంటి తీవ్రమైన నేరారోపణలు కూడా ఉన్నాయి. హత్య విషయంలో రూ.40 కోట్లు చేతులు మారాయి. హత్య జరిగిన తర్వాత ఆధారాలు తుడిచివేయడంలో దేవిరెడ్డి కీలకపాత్ర పోషించారు. హత్య విషయంలో ఆయన పాత్ర ఉందనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి. మృతదేహానికి కట్లుకట్టి, గుండెపోటు అని ప్రచారం చేశారు. కేసు నమోదు చేయవద్దని సీఐ శంకరయ్యపై ఒత్తిడి తెచ్చారు. చార్జ్‌షీట్‌ దాఖలు చేయడాన్ని చేంజ్‌ ఆఫ్‌ సర్కమ్‌స్టెన్స్‌గా పరిగణించడానికి వీల్లేదు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దశలో బెయిల్‌ మంజూరు చేయకండి’’ అని అభ్యర్ధించారు.


దేవిరెడ్డిదే కీలక పాత్ర: సునీత 

వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. ‘కేసు దర్యాప్తును సీబీఐ స్వీకరించకముందే ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి దిగువ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గంగిరెడ్డి బెయిల్‌పై ఉన్నారనే కారణంతో తమకూ బెయిల్‌ ఇవ్వాలని పిటిషనర్లు కోరడానికి వీల్లేదు. హత్యకు ప్రణాళిక రచించే దగ్గర నుంచి ఆధారాలు ధ్వంసం చేసే వరకు దేవిరెడ్డి కీలకపాత్ర పోషించారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేశారు. ఆయనకు దురుద్దేశం లేకపోతే హత్య జరగినట్లు ముందే పోలీసులకు సమాచారం ఇచ్చేవారు. పిటిషనర్‌ బెయిల్‌పై బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు.సీబీఐ తనను వేధిస్తోందని పేర్కొంటూ ఉదయకుమార్‌ రెడ్డి దర్యాప్తు అధికారిపై కేసు పెట్టారు. ఉదయకుమార్‌ రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎంపీ అవినాశ్‌రెడ్డికి మిత్రులు. ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఉదయకుమార్‌ రెడ్డిది ఒకటే గ్రామం. పిటిషనర్‌ దేవిరెడ్డికి క్రిమినల్‌ రికార్డు ఉంది. ట్రయల్‌ ముగిసేవరకు దేవిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేయవద్దు’’ అని కోరారు.

Updated Date - 2022-08-02T09:46:00+05:30 IST