Travel ban: బహ్రెయిన్ రెడ్లిస్ట్లో మరో మూడు దేశాలు!
ABN , First Publish Date - 2021-08-07T13:48:09+05:30 IST
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గల్ఫ్ దేశం బహ్రెయిన్ ఇప్పటికే భారత్ సహా పలు దేశాలపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.
మనామా: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గల్ఫ్ దేశం బహ్రెయిన్ ఇప్పటికే భారత్ సహా పలు దేశాలపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దేశానికి చెందిన పౌర విమానయాన శాఖ అధికార యంత్రాంగం మరో దేశాలపై నిషేధం విధించింది. జార్జీయా, ఉక్రెయిన్, మలావీ తాజాగా బహ్రెయిన్ రెడ్లిస్ట్ దేశాల జాబితాలో చేరాయి. ఆగస్టు 12 నుంచి ఈ మూడు దేశాలపై ఆంక్షలు అమలులోకి వస్తాయని పేర్కొంది. ఇక ఇప్పటికే ఈ జాబితాలో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఇరాన్, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పైన్స్, మలేషియా, ఇరాక్, ట్యూనీషియా, మంగోలియా, మెక్సికో, డామినికన్ రిపబ్లిక్, మయన్మార్, పనామా, దక్షిణాఫ్రికా, నమీబియా, ఉగాండా, జింబాబ్వే, మొజాబిక్ ఉన్నాయి. గడిచిన 14 రోజుల్లో ఈ రెడ్లిస్ట్ దేశాలతో కనెక్ట్ అయిన ప్రయాణికులు బహ్రెయిన్లో ప్రవేశించడానికి వీల్లేదు.
బహ్రెయిన్ పౌరులు, విదేశీ నివాసితులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రవేశానికి అనుమతి ఉన్నవారిలో 6 ఏళ్లకు పైబడిన ప్రయాణికులందరూ తప్పనిసరిగా క్యూఆర్ కోడ్తో కూడిన పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. అదికూడా ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్నదయ్యి ఉండాలి. బహ్రెయిన్ చేరుకోగానే మళ్లీ కరోనా టెస్టు ఉంటుంది. ఇక 10 రోజుల క్వారంటైన్ తర్వాత మరోసారి ఆఖరి రోజున పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. ఈ టెస్టులకు అయ్యే ఖర్చులను “BeAware Bahrain” app ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, కరోనాపై పోరులో భాగంగా ఏర్పాటైనా బహ్రెయిన్ నేషనల్ మెడికల్ టాస్క్ఫోర్స్ సూచనల మేరకు రెడ్లిస్ట్ దేశాల జాబితాలో మార్పులు ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు.