బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేయొద్దని టీడీపీ పొలిట్బ్యూరో నిర్ణయం
ABN , First Publish Date - 2021-10-04T00:25:51+05:30 IST
బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేయొద్దని టీడీపీ పొలిట్బ్యూరో నిర్ణయం
అమరావతి: బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేయొద్దని టీడీపీ పొలిట్బ్యూరో నిర్ణయించింది. అభ్యర్థిగా ఎంపిక చేసిన రాజశేఖర్, విజయమ్మ ఇతర టీడీపీ నేతలతో మాట్లాడాక నిర్ణయం ప్రకటించాలని టీడీపీ పొలిట్బ్యూరో భావించింది. ఉమ్మడి ఏపీలో మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చాక అక్కడ ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని నెలకొల్పింది టీడీపీయేనని పొలిట్బ్యూరో పేర్కొంది. నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ ఆ సంప్రదాయాన్ని పాటించలేదని టీడీపీ నేతలు గుర్తు చేశారు. బద్వేలులో మరణించిన కుటుంబానికే టికెట్ ఇవ్వడంతో పోటీ అంశంపై చర్చించారు. పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ పొలిట్బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది. నిర్ణయం ప్రకటించే ముందు బద్వేల్ నేతలతో మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. ఇక జనసేన పార్టీ కూడా బద్వేల్ బరి నుంచి తప్పుకుంది. బీజేపీ, ఇతర పార్టీలు పోటీ చేస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది.
కాగా బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడంతో ఇక్కడ ఉఎన్నిక నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 30న ఉప ఎన్నిక, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది.