YS Jagan రికార్డ్‌ను బ్రేక్ చేసిన Doctor సుధ..

ABN , First Publish Date - 2021-11-02T19:11:29+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెజార్టీ రికార్డ్‌ను అదే జిల్లాకు చెందిన బద్వేల్ అభ్యర్థి బ్రేక్ చేసేశారు...

YS Jagan రికార్డ్‌ను బ్రేక్ చేసిన Doctor సుధ..

కడప : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెజార్టీ రికార్డ్‌ను అదే జిల్లాకు చెందిన బద్వేల్ అభ్యర్థి బ్రేక్ చేసేశారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన వైఎస్ జగన్.. టీడీపీ అభ్యర్థి సింగా సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఆ రికార్డ్‌ను బద్వేల్‌ వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ బ్రేక్ చేసేశారు. 90,550 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందడం విశేషమని చెప్పుకోవచ్చు. అంటే జగన్ కంటే 440 ఓట్లు ఎక్కువ మెజార్టీనే. మొత్తంగా వైసీపీ భారీ మెజార్టీతో బద్వేలు సీటును సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


ఇది కూడా రికార్డే..

ఇదిలా ఉంటే.. అటు వైఎస్ జగన్‌ రికార్డ్‌నే కాదు 2019 ఎన్నికల్లో తన భర్త మెజార్టీకి డబుల్ ఓట్లను డాక్టర్ సుధ దక్కించుకోవడం మరో విశేషమని చెప్పుకోవచ్చు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన వెంకట సుబ్బయ్య 44,734 మెజార్టీతో గెలుపొందగా.. ఆయన ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి సుధ 90,550 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తమ్మీద రెండు రికార్డులను సుధ బ్రేక్ చేసేశారని చెప్పుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే గత ఎన్నికల్లో 2,004 ఓట్లు నోటాకు రాగా దానికి డబుల్ ఓట్లు ఈ ఉప ఎన్నికలో పోలయ్యాయి.


నోటాకు భారీగానే..

అయితే.. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది మొదలుకుని ఎన్నికల కోడ్ అమలయ్యే వరకూ చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బద్వేల్‌లోనే తిష్టవేశారు. వాస్తవానికి లక్ష మెజార్టీ వస్తుందని.. ఇదో బంపర్ మెజార్టీ కావాలని వైసీపీ అధిష్టానం అనుకున్నప్పటికీ.. అనుకున్న టార్గెట్‌ను దాదాపు చేరుకోగలిగింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడంతో బాగా వైసీపీకి కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. మరోవైపు.. నోటాకు భారీగానే ఓట్లు రావడం వైసీపీ మెజార్టీకి కాసింత దెబ్బ తగిలినట్లయ్యింది. నోటాకు నాలుగువేల వరకూ ఓట్లు వచ్చాయంటే అధికార, ప్రతిపక్షాలపై ఓటర్లు ఎంత ఆగ్రహంతో ఊగిపోతున్నారనే విషయాన్ని ఇట్లే అర్థం చేసుకోవచ్చు.

Updated Date - 2021-11-02T19:11:29+05:30 IST