చైనాకు దొరికిన యువకుడి అప్పగింతలో జాప్యానికి కారణమదే: కిరణ్ రిజిజు
ABN , First Publish Date - 2022-01-27T00:20:12+05:30 IST
అరుణాచల్ ప్రదేశ్లోని ఎగువ సియాంగ్ జిల్లా నుంచి ఈనెల 18న తప్పిపోయి చైనాకు దొరికిన..
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని ఎగువ సియాంగ్ జిల్లా నుంచి ఈనెల 18న తప్పిపోయి చైనాకు దొరికిన మీరం టోరన్ అనే యువకుడు త్వరలోనే వెనక్కి తిరిగి వస్తాడని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మీరం టోరన్ను అప్పగించేందుకు చైనా సానుకూలంగా స్పందించిందని, ఇరువైపులా వాతావరణ ప్రతికూలత కారణంగానే అతని అప్పగింతలో జాప్యం జరుగుతోందని చెప్పారు.
మీరం టోరన్ను చైనా బలగాలు అపహరించాయని అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఎంపీ టాపిర్ గోవా ఇటీవల ఆరోపించాడు. దీంతో అతడి ఆచూకి కోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సాయాన్ని భారత సైన్యం కోరింది. ఈ క్రమంలోనే బాలుడిని కనుగొన్నామని, అతడిని భారత సైన్యానికి అందించే ప్రయత్నాలు ప్రారంభించామని పీఎల్ఏ పేర్కొంది. దీనిపై కిరణ్ రిజిజు ఓ ట్వీట్లో మరింత వివరణ ఇచ్చారు. ''రిపబ్లిక్ డే సందర్భంగా చైనా పీఎల్ఏతో హాట్లైన్లో ఇండియన్ ఆర్మీ సంభాషించింది. యువకుడిని అప్పగించేందుకు పీఎల్ఏ సానుకూలంగా స్పందించింది. ఏ ప్రాంతంలో అప్పగించాలో తెలియజేయాలని కూడా పేర్కొంది. సమయం, తేదీని కూడా నిర్ణయించి ఆ విషయం మనకు తెలియజేస్తుంది. ఇరువైపులా వాతావరణ ప్రతికూలతలు ఉన్నందునే యువకుడి అప్పగింత విషయంలో జాప్యం జరుగుతోంది'' అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు.