ముస్లిం మైనార్టీలను మోసం చేసిన జగన్
ABN , First Publish Date - 2022-06-25T06:10:12+05:30 IST
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేసుకుంటూ వస్తున్నారని, ముస్లింలు జగన్ను అమితంగా అభిమానించి అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపించారని, నమ్మిన వారిని మోసం చేయడమే జగన్ నైజం అని దానిలో భాగంగానే ముస్లిం - మైనార్టీలను జగన్ మోసం చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు.
ముస్లిం మైనార్టీలను మోసం చేసిన జగన్
బాదుడే బాదుడు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్
పటమట, జూన్ 24 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేసుకుంటూ వస్తున్నారని, ముస్లింలు జగన్ను అమితంగా అభిమానించి అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపించారని, నమ్మిన వారిని మోసం చేయడమే జగన్ నైజం అని దానిలో భాగంగానే ముస్లిం - మైనార్టీలను జగన్ మోసం చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. శుక్రవారం 13వ డివిజన్ ఎలక్ట్రిసిటి కాలనీలోని గద్దె రాజారావు వీధిలో గద్దె రామ్మోహన్ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం యువతుల పెళ్లిళ్లకు వారి తల్లిదండ్రులు పడే కష్టాన్ని గమనించిన చంద్రబాబు దుల్హాన్ పథకం ద్వారా వివాహ సమయానికి పెళ్లి కుమార్తెకు రూ. 50 వేలు అందించేవారని తెలిపారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ తనని గెలిపిస్తే రూ. లక్ష ఇస్తానంటూ ముస్లిం ఓట్లు దండుకుని, గెలిచాక వారికి మొండి చెయ్యి చూపించారని ఎద్దేవా చేశారు. ఈ మూడేళ్లలో వేల మంది ముస్లిం యువతుల వివాహాలు జరిగాయని, వారంతా జగన్ ఇస్తానన్న రూ. లక్ష కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేషన్ వారు టూర్కు టీడీపీ తరఫున వెళ్లానని, అయితే తాము సందర్శించిన ఏ ప్రాంతంలో కూడా చెత్త పన్ను వసూలు చేయడం లేదని తెలిపారు. టీడీపీ కార్పొరేటర్లంతా అధికార పార్టీ వారిని నిలదీసి చెత్త పన్నును విరమింపజేసే వరకు పోరాడతామని అన్నారు. గద్దె ప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు, పేరేపి ఈశ్వర్, కొర్రపాటి శ్రీనివాస్, నూతి శ్రీనివాస్, చిట్టా నిర్మలా, మల్లెబోయిన శివాజీ, కురుముల రాజు పాల్గొన్నారు.
జగన్ పాలనలో ప్రజల జీవితాలు తలకిందులయ్యాయి
బొండా ఉమా
మధురానగర్: ఒక్క ఛాన్స్ అని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పాలనలో పేద ప్రజల జీవితాలు తలకిందులయ్యాయని సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 29 డివిజన్ మధురానగర్లో శుక్రవారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా నిర్మాణం ఆగిపోయిన ఆర్యూబీని పరిశీలించారు. అనంతరం సాయిబాబా కాలనీ 1వ లైను నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైసీపీ పాలనలో పెరిగిన ధరల వివరాలు, టీడీపీ హయాంలో డివిజన్లో చేసిన అభివృద్ధి పనులను తెలుపుతూ ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి వెళ్లి ఆయనే స్వయంగా అందించారు. వైసీపీ పాలన గురించి ప్రజల అభిప్రాయాలను అడిగారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, డివిజన్ కమిటీ నాయకులు పాల్గోన్నారు.