వ్యర్థ వాహనాలతో ఈ-బైక్‌లు.. ప్రతిభ చాటుతున్న మూడో క్లాసు ‘ఇంజినీరు’

ABN , First Publish Date - 2020-10-29T17:07:16+05:30 IST

ఎవరైనా సరే వారి వాహనం బాగా పాడైపోతే తుక్కుకింద అమ్మేస్తారు. అయితే...

వ్యర్థ వాహనాలతో ఈ-బైక్‌లు.. ప్రతిభ చాటుతున్న మూడో క్లాసు ‘ఇంజినీరు’

ఆజమ్‌గఢ్: ఎవరైనా సరే వారి వాహనం బాగా పాడైపోతే తుక్కుకింద అమ్మేస్తారు. అయితే యూపీలోని ఆజమ్‌గఢ్‌కు చెందిన మూడవ తరగతి వరకూ చదువుకున్న ఒక యువకుడు పాడయిన బైక్‌లను ఈ-బైక్‌లుగా మార్చేస్తుంటాడు. సరాయ్‌మీర్‌కు చెందిన సలీం ఎటువంటి ఇంజినీరింగ్ కాలేజీలోనూ చదువుకోలేదు. అయితే పెద్ద పెద్ద ఇంజినీర్లకు సమానమైన ప్రతిభను కనబరుస్తున్నాడు. కేవలం రెండు వేల రూపాయలకు పూర్తిగా పాడయిన బైక్ కొనుగోలు చేసి... దానిని విద్యుత్‌తో నడిచే బైక్ మాదిరిగా మార్చి, విక్రయిస్తూ తన అవసరాలు తీర్చుకుంటున్నాడు. సలీం ఇప్పటివరకూ ఈ విధంగా నాలుగు ఈ- బైక్‌లు, ఒక కారు తయారు చేసి విక్రయించాడు. 


ఈ ఐదు వాహనాలు చాలా నెలలుగా విజయవంతంగా నడుస్తున్నాయి. 44 ఏళ్ల సలీం సౌదీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు. అయితే అక్కడి పరిస్థితులు నచ్చక 2016లో సలీం భారత్‌కు తిరిగొచ్చాడు. కొద్ది రోజుల పాటు చిన్నాచితకా పనులు చేసి, విసిగి పోయాడు. సొంతంగా ఏదైనా చేయాలని భావించి, ముందుగా పాడయిన బైక్‌లను కొనుగోలు చేశాడు. తరువాత వాటి ఇంజిన్ తొలగించి బ్యాటరీ అమర్చి, ఆ వాహనాలను వినియోగించేందుకు అనువుగా మార్చేవాడు. అలాగే మార్కెట్‌లో లభ్యమయ్యే ఈ-బైక్‌లను పరిశీలించి, వాటి తరహాలో చార్జింగ్ పాయింట్లను అమర్చి వాహనాలను సిద్ధం చేస్తుంటాడు. సలీంకు ఇద్దరు సోదరులు. చిన్నప్పటి నుంచి చదువుపై అంతగా ఇష్టంలేని సలీం ఎలక్ట్రానిక్ పరికరాలు పరిశీలిస్తూ, కొత్తవాటిని తయారు చేసేందుకు ప్రయత్నిస్తుండేవాడు. ఇదే సమయంలో తనలో ఒక ఇంజినీరు ఉన్నాడని సలీం గ్రహించాడు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ ఒక ఈ-బైక్ తయారు చేయడం ద్వారా పదింతల ఆదాయం వస్తున్నదని, ఈ వాహనం తయారీకి మూడు వేల వరకూ ఖర్చు అవుతున్నదని తెలిపాడు. సుజుకీ సమురాయ్ వాహనాన్ని ఈ- బైక్‌గా మార్చి రూ. 30 వేలకు విక్రయించానని తెలిపారు. దీని తరువాత కూడా ఇలానే ఈ- వాహనాలను రూపొందించి, విక్రయించానని తెలిపాడు. కాగా సలీం పనితనాన్ని స్థానికులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. 


Updated Date - 2020-10-29T17:07:16+05:30 IST