Azadi Ka Amrit Mahotsav: 1983లో కపిల్ దేవ్ జట్టు దేశానికి తొలి క్రికెట్ ప్రపంచ కప్ తెచ్చిన వేళ...
ABN , First Publish Date - 2022-07-19T15:39:48+05:30 IST
భారతదేశం ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్...
భారతదేశం ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటోంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కాగా, ఈ 75 ఏళ్లలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో విజయాలు సాధించింది. దానిలో కపిల్ దేవ్ జట్టు దేశానికి తొలి క్రికెట్ ప్రపంచ కప్ తీసుకు రావడాన్ని మహోన్నత ఘట్టంగా పేర్కొనవచ్చు. ఈ ప్రపంచకప్ భారత్ సాధించడానికి ముందు క్రికెట్ పిచ్లో బలహీనమైన జట్లలో భారతదేశాన్ని ఒకటిగా పరిగణించేవారు. అది... జూన్ 25, 1983 ఆరోజు భారత్కు ఎంతో ప్రత్యేకమైనది. కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారతదేశం ప్రపంచ కప్ గెలిచిన రోజది. అండర్డాగ్ ఇండియా గ్రూప్ రౌండ్లు, నాకౌట్ మ్యాచ్లు ఆడి ఫైనల్స్కు చేరుకుంది.
ఆపై ఫైనల్స్లో వెస్టిండీస్ పోటీ పడింది. వెస్టిండీస్ అప్పట్లో అత్యుత్తమ జట్టుగా గుర్తింపు పొందింది. నాటి ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ సమయంలో తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా పెద్దగా రాణించలేక 183 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్లో శ్రీకాంత్ 38, సందీప్ పాటిల్ 27, మొహిందర్ అమర్నాథ్ 26 పరుగులు చేశారు. వెస్టిండీస్ 60 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించాల్సి ఉంది. భారత బౌలర్ల ముందు వెస్టిండీస్ ఎదురునిలవలేకపోయింది. 1983కి ముందు ప్రపంచకప్లో భారత్ ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచింది. అందుకే 1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత మహోన్నత చరిత్రలో నిలిచిపోతుంది.