బస్సు ఢీకొని అయ్యప్ప దీక్షాదారుడి మృతి
ABN , First Publish Date - 2021-12-03T06:05:38+05:30 IST
జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న అండర్ బ్రిడ్జిలో మోటారు సైక్లిస్ట్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో అయ్యప్ప స్వామి ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
జీవీఎంసీ అండర్ బ్రిడ్జిలో ప్రమాదం
విశాఖపట్నం, డిసెంబరు 2 : జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న అండర్ బ్రిడ్జిలో మోటారు సైక్లిస్ట్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో అయ్యప్ప స్వామి ఒకరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం మేరకు...మద్దిలపాలెం కేఆర్ఎం కాలనీకి చెందిన జీరు వెంకటరావు (46) ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు. గురువారం కుమార్తె మానిష్ను మోటారు సైకిల్పై తీసుకువెళ్లి ద్వారకానగర్ రెండోలైన్లో దింపాడు.
అక్కడి నుంచి సొంత పనులు చూసుకుని అండర్ బ్రిడ్జి మీదుగా తిరిగి ఇంటికి వెళ్తుండగా కాంప్లెక్స్ వైపు నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వెంకటరావు రోడ్డుపైకి తుళ్లిపడ్డాడు. తలకు బలమైన గాయం కావడం తో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న మనీష ఘటనా స్థలికి చేరుకుని భోరుమంది. వెంకటరావు ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. మృతుని కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారాకా స్టేషన్ సీఐ గొలగాని అప్పారావు ఆధ్వర్యంలో ఎస్ఐ సూర్యకళ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.