అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2022-02-24T21:22:13+05:30 IST
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్నపై నమోదైన కేసుల్లో తదనంతర చర్యలపై హైకోర్టు స్టే విధించింది.
అమరావతి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్నపై నమోదైన కేసుల్లో తదనంతర చర్యలపై హైకోర్టు స్టే విధించింది. ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. సీఎం జగన్ దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై పశ్చిమగోదావరి జిల్లాలో 505(2), 153(ఎ), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అయ్యన్నపాత్రుడి ఇంటికి నల్లజర్ల పోలీసులు నోటీసులంటించారు. బుధవారం రాత్రి అయ్యన్నపాత్రుడిన అరెస్ట్ చేసేందకు ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల చర్యలపై హైకోర్టులో అయ్యన్నపాత్రుడి తరపు న్యాయవాది సతీష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది.
అయ్యన్న పాత్రుడు ఇంటికి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు వచ్చారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో గోడకు 41-ఏ నోటీసు అంటించి వెనుతిరిగారు. ఈనెల 18న పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హాజరైన అయ్యన్న తన ప్రసంగంలో జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అక్కడి వైసీపీ నాయకుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో అయ్యన్నపై పోలీసులు ఐపీసీ 153 (ఏ), 502 (2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9.30 గంటలకు అయ్యన్న ఇంటికి తాడేపల్లిగూడెం సీఐ రఘు, నల్లజర్ల ఎస్ఐ ఐ.అవినాశ్, దేవరపల్లి ఎస్ఐ కె.శ్రీహరిరావు వచ్చారు. అయ్యన్న గురించి ఆయన పీఏ రామచంద్రరావును అడిగారు. ఆయన లేరని, ఎక్కడకు వెళ్లారో తెలియదని పీఏ చెప్పడంతో మధ్యాహ్నం 1.30 గంటల వరకు వేచిచూసి ఇంటి గోడకు 41ఏ నోటీసు అంటించారు.