ఆయుష్మాన్ భారత్ని తెలంగాణలో అమలు చేయాలి: రాజాసింగ్
ABN , First Publish Date - 2021-05-18T19:35:48+05:30 IST
కరోనా బారిన పడి రాష్ట్రంలో ప్రజలు వేలల్లో చనిపోతున్నారని బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ అన్నారు.
హైదరాబాద్: కరోనా బారిన పడి రాష్ట్రంలో ప్రజలు వేలల్లో చనిపోతున్నారని బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షల మంది కరోనా బాధిత కుటుంబాలు హాస్పిటల్ ఫీజులు చెల్లించలేక ఆర్థికంగా కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సలో రూ.5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే ఆయుష్మాన్ భారత్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక పోవడంతో రాష్ట్ర ప్రజలు అప్పుల పాలవుతున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని కూడా అమలు చేయడం లేదన్నారు. సర్కార్ హాస్పిటళ్లకు పోలేక, ప్రైవేటు హాస్పిటల్ ఫీజులు చెల్లించలేక కరోనా బాధితులు ప్రాణాలు వదులుతున్నారన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్యశ్రీ లో కోవిడ్ చికిత్సను చేర్చాలన్న డిమాండ్తో రేపు రాష్ట్ర బీజేపీ చేపట్టబోయే “గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష” ను విజయవంతం చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు.