కరోనాపై పోరుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సూత్రాలు
ABN , First Publish Date - 2020-04-07T00:07:49+05:30 IST
ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిపై తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మన దేశంలో సహజ సిద్ధంగా లభించే..
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిపై తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మన దేశంలో సహజ సిద్ధంగా లభించే.. మనం నిత్యం భోజనంలో ఉపయోగించే కొన్ని పదార్థాలతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ తులసి ఆకులను తినడం.. ఆహారంలో దాల్చినచెక్క, మిరియాలు, శొంఠి, కిస్మిస్ ఉండేలా చూసుకుంటే సరిపోతుందంటున్నారు.
కాగా.. కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఎవరికివారు రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేలా ఇప్పటికే ఆయుష్ ప్రొటోకాల్ను ప్రకటించింది. దీని ప్రకారం.. ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తాగడం, 30 నిమిషాలపాటు యోగా/ప్రాణాయామం చేయడం, బెల్లం తినడం, నిమ్మకాయ షర్బత్ తాగడం, పరగడపున 10 గ్రాముల చ్యవన్ప్రాశ్ తీసుకోవడం మంచిదని ఆయుష్ ప్రొటోకాల్ చెబుతోంది.
ఆయుష్ వైద్యులు కూడా మృత్యుంజయ రస, సంజీవనీ వటి, తులసీ వంటి ఆయుర్వేద ఔషధాలను వాడటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు. కరోనా కల్లోలం సమసిపోయేదాకా.. 150 మిల్లీలీటర్ల వేడినీటిలో అర చెంచా పసుపు వేసుకుని రోజుకు రెండు సార్లు తాగాలని, నాసికా రంధ్రాలకు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెలేదా నేతిని పూయాలని సూచిస్తున్నారు.
రోజూ ఇలా చేసినా ఫలితం..!
నీళ్లలో పుదీనా, వాము వేసి ఆవిరి పట్టాలి.
లవంగాల పొడిని తేనె లేదా పంచదారతో కలిసి తీసుకున్నా ఫలితం ఉంటుంది.
పొడి దగ్గు, గొంతు నొప్పి ఉంటే...
నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యి మూడు నాలుగు చుక్కలను ఉదయం, సాయంత్రం ముక్కులో వేసుకోవాలి.
ఒక టేబుల్స్పూన్ నువ్వు ల నూనె లేదా కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని ఆయిల్ పుల్లింగ్ చేయాలి. రెండు, మూడు నిమిషాలు చేసిన తరువాత గోరు వెచ్చని నీటితో పుక్కిలించాలి. రోజులో ఒకటి రెండుసార్లు ఇలా చేయాలి.
సాధారణ నియమాలు
రోజంతా గోరు వెచ్చని నీళ్లు తాగండి.
ప్రతిరోజూ యోగాసనాలు వేయండి. ప్రాణాయామం చేయండి. కనీసం అరగంట పాటు ధ్యానం చేయండి.
పసుపు, జీలకర్ర, కొత్తిమీరను రోజూ వంటల్లో ఉపయోగించండి.
రోగనిరోధక శక్తి పెరగడం కోసం...
ప్రతిరోజు ఉదయం ఒక టేబుల్స్పూన్ చ్యవన్ప్రాశ్ తీసుకోండి.
హెర్బల్ టీ తాగండి. తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి వేసుకొని తయారుచేసిన హెర్బల్ టీ మరింత ఉపయుక్తం. రుచిని కోరుకునే వారు బెల్లం, నిమ్మరసం జత చేసుకోవచ్చు. రోజులో రెండుసార్లు ఇది తీసుకోవాలి.
పాలలో అర టీస్పూన్ పసుపు వేసుకొని రోజులో రెండుసార్లు తాగండిపాలలో అర టీస్పూన్ పసుపు వేసుకొని రోజులో రెండుసార్లు తాగండి.