అయోధ్య భూమి పూజకు మొదటి ఆహ్వానం ముస్లింకే..!

ABN , First Publish Date - 2020-08-03T19:36:22+05:30 IST

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరగనున్న భూమి పూజ సందర్భంగా హిందూ, ముస్లింల మధ్య సోదర..

అయోధ్య భూమి పూజకు మొదటి ఆహ్వానం ముస్లింకే..!

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగే భూమిపూజ సందర్భంగా హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందించే అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి ఇవాళ తొలి ఆహ్వానం అందింది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై ముస్లింల తరపున బలంగా గళం వినిపించిన వారిలో అన్సారీ ఒకరు. కాగా భూమిపూజ కోసం తనను ఆహ్వానించడం పట్ల అన్సారీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘నాకు తొలి ఆహ్వానం అందాలన్నది సాక్షాత్తూ శ్రీరాముడి ఆకాంక్ష అని భావిస్తున్నాను. అందుకే దీన్ని మనస్పూర్తిగా స్వీకరిస్తున్నాను..’’ అని అన్సారీ వ్యాఖ్యానించారు.


ఈ నెల 5న ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం కోసం ప్రధాని సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాషాయం రంగులో ముద్రించిన ఆహ్వాన పత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ తదితర అతిథుల పేర్లు ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా కేవలం 180 మందికి మాత్రమే భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అతిథుల జాబితాలో తొలుత 200 మందికిపైగా చోటు కల్పించినప్పటికీ.. మళ్లీ దీన్ని తగ్గించి కేవలం 170 నుంచి 180 మందిని మాత్రమే ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.



Updated Date - 2020-08-03T19:36:22+05:30 IST