అవినీతి రహితంగా పనిచేయాలి
ABN , First Publish Date - 2022-05-15T06:40:03+05:30 IST
అవినీతి రహితంగా పనిచేయాలి
ఎస్పీ సిద్ధార్థ కౌశల్
పెనమలూరు, మే 14 : ప్రతి ఒక్కరూ తమ విధుల్లో అవినీతి రహితంగా పనిచేయాలని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని పోలీసు సిబ్బందిని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హెచ్చరించారు. శనివారం పెనమలూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో మాట్లాడి ఫిర్యాదుపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం రిసెప్షన్ రిజిస్టర్ను పరిశీలించారు. రిసెప్షన్ పనితీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్యూటీ నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను తీర్చడంలో కృషి చేయాలన్నారు. ముఖ్య మంత్రి జగన్ ఆదేశాల మేరకు, డీజీపీ కె. రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వుల మేరకు మహిళల భద్రతకు అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.