ఆటోవాలా.. బతుకు డీలా
ABN , First Publish Date - 2022-08-01T05:23:44+05:30 IST
ఆటోవాలా.. బతుకు డీలా
పొద్దంతా వాహనం నడిపినా కుటుంబ పోషణ కష్టమే
పెరిగిన డీజిల్ ధరలతో డ్రైవర్లు విలవిల
ఆర్థికంగా లేక ఫైనాన్స్లు.. వాహన కిస్తీల కోసం మళ్లీ అప్పులు
రెండేళ్లు కరోనాతో చితికిన బతుకులు
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
నేడు ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవం
మహబూబాబాద్ టౌన్, జూలై 31 : పొద్దంతా కష్టపడ్డా కుటుంబం గడువదు.. రాత్రి, పగలు ఆటో నడిపినా ఆర్థిక సమస్యలు తీరవు.. పొదుపు లేక, పూట గడువక ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్లు. ఉన్నత చదువులు చదివినా, ఉద్యోగాలు రాక పోవడంతో కుటుంబాల పోషణ కోసం ఆటో లు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నారు వారు. పపంచ ఆటోడ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవిత గాథలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
గ్రామాలు.. పట్టణాల్లో అనేక నిరుపేద కుటుంబాలకు చెందిన ఎంతోమంది యువకులు ఆటోల ను కొనుగోలు చేసుకుని, స్వయంగా వారే నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నారు. డబ్బుల్లేక ఫైనాన్స్ కంపెనీల వద్ద అప్పులు తీసుకుని, ఆటోలను కొనుగోలు చేస్తున్నారు. ఆటో పొద్దంతా తిరిగితే రెక్కల కష్టంతో వచ్చిన నగదునుసంతోషంగా తమ ఇంటికి తీసుకవెళ్లకుండా కిస్తీలు చెల్లించి, ఉట్టి చేతులతో వెళ్లాల్సిన దైన్యస్థితి నెలకొంది. ఏటా ఇన్సూరెన్స్, ఫిట్నె్సలంటూ అధిక భారాలు మోపుతున్నారు. కనీసం సొంత ఇళ్లు కూడ లేకపోవడం తో కిరాయి ఇళ్లల్లో ఉంటూ కాలాన్ని వెళ్లదీస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో ఆటోలు నడవక గిరాకీలేక, కిస్తీలను కట్టడానికి మళ్లీ అప్పులు చేస్తు న్నారు కొందరు డ్రైవర్లు.
రెండేళ్లు కరోనాతో చితికిన బతుకులు..
దాదాపుగా రెండేళ్లపాటు కరోనా వైరస్ నేపథ్యం లో ఆటోలు నడవక డ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. 2020 మార్చిలో కరోనా మహహ్మరి విజృంభణతో లాక్డౌన్ ఆరంభంతో ఆటోలు రోడ్డెక్కక ఇంటికే పరిమితమయ్యాయి. ఆ సమయంలో మూడు నెలలకుపైగా లాక్డౌన్తో పనిలేక కుటుంబాన్ని పోషించడమే భారమైంది. కరోనాతో ఆటోలను అంతంత మాత్రంగానే నడవడంతో ఓ పక్క కుటుంబాన్ని పోషించుకోలేక, మరోపక్క ఆటోఫైనాన్స్ కిస్తీలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. దినదినం పెరుగుతున్న డీజిల్ రేట్లు డ్రైవర్లకు గుదిబండగా మారాయి.
జిల్లాలో 13 వేల ఆటోలు, 50 వేల మంది ఆధారం..
మహబూబాబాద్ జిల్లాలో సుమారు 13 వేల పైచిలుకు ఆటోలున్నాయి. ఒక్కో ఆటోపై ఒక్కో కుటుంబం ఆధారపడి ఉండటంతో మొత్తంగా దాదాపుగా 50 వేల మంది జీవనోపాధి వాటిపై ఆధారపడి ఉంది. అందులో మానుకోట అర్బన్లో 1700 వరకు ఉండ గా, మిగతా ఆటోలు 16 మండలాల పరిధిల్లో ఉన్నాయి. జిల్లా జనాభాలో సుమా రు 8 శాతం మంది ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. లక్షల రూపాయలు పన్నుల రూ పంలో ప్రభుత్వానికి చెల్తిస్తున్నస్తున్నపట్టికి ఆటో డ్రైవర్లను కార్మికులుగా గుర్తించడం లేదు. కార్మిక చట్టం వర్తింప చేయడం లేదు.
ఆటో డ్రైవర్లు తమ హక్కులను సాధించుకోవడంతోపాటు సమస్యల పరిష్కారానికి 2001లో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ (తాడు)ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఈ సంఘం పరిధిలోనే పనిచేస్తూ తమహక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాము సైతం అంటూ తాడు నేతృత్వంలో ఆటోడ్రైవర్లు ఉద్యమించారు. ఈ పోరాటంలో 22 మంది ఆటోడ్రైవర్లు అసువులు బాసారు. రాష్ట్రం సిద్ధించాక 2014 సంవత్సరం నాటి నుంచి ఏటా ఆగస్టు 1న ప్రపంచ ఆటోడ్రైవర్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మానుకోట జిల్లా కేంద్రంలో తాడు ఆధ్వర్యంలో సోమవారం (నేడు) పెద్దఎత్తున బహిరంగ సభను నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే వాల్ పోస్టర్లను ముద్రించి జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేపట్టారు. పెద్దఎత్తున ర్యాలీ చేపట్టి, సభను నిర్వహించి తమ డిమాండ్లను పాలకుల దృష్టికి తీసుకువెళ్లడానికి ఆటోడ్రైవర్లు ఏకమయ్యారు.
ఆటో డ్రైవర్ల డిమాండ్లు ఇవే..
- ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలి.
- ప్రతీ ఆటోకు పూర్తి ఇన్సూరెన్స్ను ప్రభుత్వమే భరించాలి.
- అర్హులైన డ్రైవర్లకు డబుల్బెడ్ రూం పథకం వర్తింప జేయాలి
- ఈఎ్సఐ, పీఎఫ్, హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలి.
- ప్రైవేట్ ఫైనాన్స్ల దోపిడీని అరికడుతూ, సీజింగ్ వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వమే బ్యాంక్ల ద్వారా వడ్డీలేని రుణాలు అందించాలి.
- డ్రైవర్ల పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
- డ్రైవర్ సాధారణ మరణం చెందినప్పటికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను వర్తింపజేయాలి.
- జిల్లా కేంద్రంలో ఆటో భవన్ నిర్మించాలి.
- 50 ఏళ్లు నిండిన ఆటో డ్రైవర్లకు రూ.5 వేల ఫించన్ అందించాలి.
డ్రైవర్ల కోసం కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి.. : నలమాస సాయి, తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ (తాడు) జిల్లా అధ్యక్షుడు
ఆటో డ్రైవర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి. ఒక్కో ఆటోపై నలుగురు కుటుంబసభ్యులు జీవనోపాధి పొందుతున్నారు. రోజూ ఆటో నడిస్తినే కుటుం బ గడుస్తోంది. పొద్దంతా కష్టపడ్డా ఆర్థిక పరిస్థితి మెరుగుపడక పోగా, అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాం. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహకారాన్ని అందించాలి.
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా.. : యాళ్ల మురళీధర్రెడ్డి, తాడు జిల్లా గౌరవ అధ్యక్షుడు, మహబూబాబాద్
ఆటో డ్రైవర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి స మస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రి యాశీల పాత్ర పోషించిన డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకునేలా పాటు పడుతా. ప్రజాప్రతినిధుల సహకారంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆటోనగర్ ఏర్పాటుకు కృషి చేస్తాను. డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తా.
నేడు మానుకోటలో ర్యాలీ, బహిరంగ సభ
ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ (తాడు) ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి బస్టాండ్ సెంటర్, రైల్వేస్టేషన్, ఆర్యూబీ, తొర్రూరు బస్టాండ్ మీదుగా ముత్యాలమ్మ గుడి సెంటర్ వరకు ర్యాలీ కొనసాగనుంది. అక్కడే యూనియన్ జెండాను ఆవిష్కరించి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్నాయక్, డీఎ్స రెడ్యానాయక్, హరిప్రియ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు హాజరవుతారని తాడు జిల్లా గౌరవ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నలమాస సాయి తెలిపారు.