గీత దాటితే ఇంటికే చలానా
ABN , First Publish Date - 2022-04-05T13:00:35+05:30 IST
ఏదో పనిపడిందని హడావుడిగా సిగ్నళ్లను దాటేస్తున్నారా?.. ఎవరు చూడడం లేదని రెడ్సిగ్నల్ను నిర్లక్ష్యం చేస్తున్నారా?.. అయితే ఇక మీ ఇంటికే నేరుగా చలానా రాబోతోంది.
- నగరంలో పది చోట్ల ఆటోమేటిక్ కెమెరాలు
చెన్నై: ఏదో పనిపడిందని హడావుడిగా సిగ్నళ్లను దాటేస్తున్నారా?.. ఎవరు చూడడం లేదని రెడ్సిగ్నల్ను నిర్లక్ష్యం చేస్తున్నారా?.. అయితే ఇక మీ ఇంటికే నేరుగా చలానా రాబోతోంది. నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించేవారికి జరిమానా విధించేందుకు అనువుగా పది ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆటోమేటిక్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల అమింజికరై, అన్నానగర్ సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కెమెరాల వల్ల వాహన చోధకులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారని తెలిపారు. ఆ రెండు చోట్ల సిగ్నళ్లు దాటిన వాహనాలను ఆ కెమెరాలు ఫొటో తీసి పంపటంతో, వాటి యజమానులకు జరిమానా చలాన్లను ఇళ్ళవద్దకే పంపినట్లు చెప్పారు. ఆ రెండు చోట్ల ఆటోమేటిక్ కెమెరాలు సమర్థవంతంగా పనిచేయడంతో తాజాగా పదిచోట్ల ఆ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తేనాంపేట ఎస్ఐటీ జంక్షన్, పురుషవాక్కం గంగాదీశ్వరాలయ జంక్షన్, సైదాపేట లిటిల్ మౌంట్, కోయంబేడు సౌత్ఏషియా స్పోర్ట్ విలేజ్ కూడలి వద్ద, వాల్టాక్స్ రోడ్డు ఎన్ఎస్సీ బోస్ రోడ్డు కూడలి వద్ద, రాయపేట గౌడియామఠం కూడలి వద్ద, మైలాపూరు ఆర్కే మఠ్ కూడలి వద్ద, తేనాంపేట ఎల్డామస్ రోడ్డు కూడలి వద్ద ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సిగ్నల్ వద్ద వాహనాలు గీత దాటితే వాటి యజమానుల పేరుతో జరిమానా చలానా ఇళ్ళవద్దకే పంపుతామని తెలిపారు.