రివర్స్గేర్లోనే ఆటో
ABN , First Publish Date - 2020-07-15T05:32:19+05:30 IST
దేశంలో ఆటోమొబైల్ రంగం పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంది. కొవిడ్-19 కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 78.43 శాతం తగ్గాయి...
- 9వ త్రైమాసికంలోనూ అమ్మకాల క్షీణత
న్యూఢిల్లీ: దేశంలో ఆటోమొబైల్ రంగం పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంది. కొవిడ్-19 కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 78.43 శాతం తగ్గాయి. గత రెండు దశాబ్దాల కాలంలో ఆటో అమ్మకాల్లో ఏర్పడిన అతి పెద్ద మాంద్యం ఇదేనని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తెలిపింది. కాగా జూన్ నెలలో వాహనాల విక్రయాల్లో 49.59 శాతం తగ్గుదల నమోదైనట్లు సియామ్ తెలిపింది. ఈ నెలలో మొత్తం 1,05,617 వాహనాలు అమ్ముడుపోయాయి. ద్విచక్రవాహనాల విక్రయాలు 38.56 శాతం క్షీణించి 10,13,431 యూనిట్లకు పడిపోయాయి.
విభాగాల వారీగా మొదటి త్రైమాసిక విక్రయాలు
- దేశంలో వాణిజ్య వాహనాల విక్రయాలు 84.81 శాతం క్షీణించాయి. గత ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చితే అమ్మకాలు 2,08,310 యూనిట్ల నుంచి 31,636 యూనిట్లకు పడిపోయాయి. ఈ విభాగంలో అమ్మకాలు తగ్గడం వరుసగా ఇది ఐదో త్రైమాసికం కాగా 15 ఏళ్ల కాలంలో సుదీర్ఘమైన మాంద్యం ఇదే
- ప్రయాణికుల వాహన అమ్మకాలు 7,12,684 నుంచి 1,53, 734కి తగ్గాయి.ఇది 20ఏళ్లలో అతి సుదీర్ఘమైన మాంద్యం
- ద్విచక్ర విక్రయాలు 74.21 శాతం తగ్గి 50,13,067 యూనిట్ల నుంచి 12,93,113 యూనిట్లకు తగ్గాయి
- త్రీవీలర్ అమ్మకాలు 91.48 శాతం తగ్గి 1,49,797 యూనిట్ల నుంచి 12,760 యూనిట్లకు పడిపోయాయి.