నమ్మకంగా మెలిగి దోచేసిన ఆటోడ్రైవర్‌

ABN , First Publish Date - 2021-01-17T11:45:14+05:30 IST

వృద్ధ దంపతులతో నమ్మకంగా మెలిగి.. వారితో మంచి పరిచయం పెంచుకొని

నమ్మకంగా మెలిగి దోచేసిన ఆటోడ్రైవర్‌

  • అరెస్టు చేసిన మీర్‌పేట పోలీసులు... 
  • రూ. 3.95లక్షల సొత్తు స్వాధీనం

హైదరాబాద్/సరూర్‌నగర్‌ : వృద్ధ దంపతులతో నమ్మకంగా మెలిగి.. వారితో మంచి పరిచయం పెంచుకొని చివరకు వారి ఇంటినే దోచేసిన ఆటోడ్రైవర్‌ను మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ. 3.95లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.  మహబూబ్‌నగర్‌కు చెందిన సారా నాగయ్య బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి మీర్‌పేట పరిధిలోని గాంధీనగర్‌లో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని తిరుమల హిల్స్‌కు చెందిన వృద్ధ దంపతులు ఇతని ఆటోలో వెళ్లిన సమయంలో వారి మధ్య పరిచయం ఏర్పడింది.


నాటినుంచి వారికి ఏ అవసరం ఉన్నా... బయటకు వెళ్లడానికి నాగయ్య ఆటోలోనే వెళ్లేవారు. ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేయించుకునే వారు. ఇందుకు నాగయ్య వారికి సహకరించేవాడు. వృద్ధుల ఇంట్లో భారీగానే బంగారం నగలు ఉన్నట్లు నాగయ్య గుర్తించి కొట్టేయాలని అనుకున్నాడు. ఓసారి షాపింగ్‌కు వెళ్లిన సందర్భంలో ఇంటి తాళం నాగయ్య ఆటోలో పడిపోయింది. అదునుకోసం ఎదురు చూస్తున్న అతను తాళం చెవి తీసుకొని వెంటనే తన స్నేహితుడి బైక్‌పై ఆ దంపతుల ఇంటికి వెళ్లాడు. తాళం తీసి ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, రూ. 75వేల నగదు దోచేశాడు.  ఇంటికి వెళ్లిన దంపతులు దొంగలు పడ్డారని గుర్తించారు. వెంటనే ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సేకరించి ఆటోడ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ. 3.95లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Updated Date - 2021-01-17T11:45:14+05:30 IST