ఆటో డ్రైవర్‌ నిజాయితీ

ABN , First Publish Date - 2022-05-17T05:34:07+05:30 IST

ఒక వివా హానికి వచ్చిన దంపతులు ఆటోలో ఎక్కి తమ నగలతో వున్న బట్టల బ్యాగ్‌ మరిచిపోయారు. ఈ సంఘ టనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆటో డ్రైవర్‌ నిజాయితీ
డ్రైవర్‌కు నగదు బహుమతి అందిస్తున్న సీఐ

ఆటోలో బ్యాగు మరిచిపోయిన ప్రయాణికులు

అడ్రస్‌ తెలుసుకుని అందజేత..బ్యాగ్‌లో రూ.5 లక్షల విలువైన నగలు

 ఏలూరు క్రైం, మే 16 : ఒక వివా హానికి వచ్చిన దంపతులు ఆటోలో ఎక్కి తమ నగలతో వున్న బట్టల బ్యాగ్‌ మరిచిపోయారు. ఈ సంఘ టనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవరు తన ఆటోను తుడిచే సమయంలో బ్యాగ్‌ను గుర్తించి బ్యాగు పోగొట్టుకున్న వారి ఇంటికి వెళ్లి ఆరా తీశాడు. అనంతరం ఆ బ్యాగును పోలీసుల సమక్షంలో అందజేశారు. ఏలూరు సమీపంలోని వట్లూరు సీతారాంపురానికి చెందిన పెండెం ప్రవీణ్‌ కుమార్‌ ఎంఏ బీఈడీ చేసి ఆటోడ్రైవరుగా జీవిస్తున్నాడు. అతని భార్య అనిత త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఏలూరు సమీపంలోని తంగెళ్లమూడి లక్ష్మినగర్‌లో విశ్రాంత ఉద్యోగి దొంతంశెట్టి కాశీ విశ్వేశ్వరరావు నివాస ముంటున్నారు. ఆయన కుమారుడు శశిభూషణ్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. శశిభూషణ్‌, అతని భార్య హేమలత ఆదివారం ఏలూరులోని కొత్తపేటలో జరిగే వివాహానికి హాజ రయ్యారు. మధ్యా హ్నం అక్కడి నుంచి తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు ప్రవీణ్‌ కుమార్‌ కొత్తపేటలో ఆటో ఎక్కి లక్ష్మినగర్‌లో దిగారు. లగేజి బ్యాగ్‌ను ఆటో వెనుక వైపు పెట్టి తీసుకోవడం మర్చిపోయారు. సోమవారం ఉదయం ఆటో తుడుచు కుంటున్న సమయంలో ఈ బ్యాగు కన్పించింది. బ్యాగులో బంగారు ఆభరణాలు ఉన్నాయి. వెంటనే భార్య అనితకు చెప్పడంతో ఆమె సూచన మేరకు ఎవరెవరు ఆటో ఎక్కారో వారి ఇళ్లకు వెళ్లి విచారించాడు. కాశీ విశ్వేశరరావు ఇంటికి వెళ్లి విచారించగా తమ బ్యాగు పోయిందని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసుల వద్దకు వెళ్లి సీఐ డీవీ రమణ ఆధ్వర్యంలో వంద గ్రాముల బంగారు ఆభరణాలను వారికి అప్పగించారు. వీటి విలువ రూ.5.5 లక్షలు ఉంటుందన్నారు. ఆటో డ్రైవరు ప్రవీణ్‌ కుమార్‌ను సీఐ అభినందించి నగదు బహుమతి అందించారు. 



Updated Date - 2022-05-17T05:34:07+05:30 IST