లక్ష్యసాధనలో అధికారులు విఫలం
ABN , First Publish Date - 2022-06-29T05:59:42+05:30 IST
అధికారుల సమన్వయ లోపం కారణంగానే జిల్లాలో ప్రభుత్వ భవన నిర్మాణాలు జాప్యం జరుగుతున్నాయని, లక్ష్య సాధనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమన్వయలోపంతో పనుల్లో జాప్యం
భవన నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి
కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
కలెక్టరేట్, జూన్ 28: అధికారుల సమన్వయ లోపం కారణంగానే జిల్లాలో ప్రభుత్వ భవన నిర్మాణాలు జాప్యం జరుగుతున్నాయని, లక్ష్య సాధనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండలస్థాయి అధికారులతో కలెక్టర్ మం గళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద చేపడుతున్న కాంపోనెంట్ భవన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిధులు ఎంత ఖర్చు చేస్తే జిల్లాకు అదనంగా మరిన్ని నిధులు వస్తాయని తెలిపారు. ఆగస్టు నాటికి గ్రామ సచివాలయాలు, సెప్టెంబరు నాటికి రైతు భరోసా కేంద్రాలు, అక్టోబర్ నాటికి హెల్త్ క్లినిక్లు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇక నుంచి మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు సమన్వయంతో పనిచేసి అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. 41 వేలు గృహ నిర్మాణాలు కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, డీపీవో వి.రవికుమార్, గృహనిర్మాణ సంస్థ పీడీ ఎం.గణపతిరావు, డ్వామా పీడీ ఎం.రోజారాణి, జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.