‘పోడు’ మహిళలపై అధికారుల దాడి

ABN , First Publish Date - 2022-06-27T09:24:02+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాడు, మద్దుకూరు శివారుల్లో పోడు రగడ మరోసారి రాజుకుంది...

‘పోడు’ మహిళలపై అధికారుల దాడి

పలువురికి తీవ్ర గాయాలు 

పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు 

భద్రాద్రి జిల్లాలో ఘటనలు 


చండ్రుగొండ, జూన్‌ 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాడు, మద్దుకూరు శివారుల్లో పోడు రగడ మరోసారి రాజుకుంది. ఈ అటవీ ప్రాంతాల్లోని పోడుసాగుదారులపై శుక్ర, శనివారాల్లో అటవీ ఆధికారులు దాడికి పాల్పడ్డ ఘటనలు ఆదివారం వెలుగు చూశాయి. ఈ రెండు ప్రాంతాల్లో వలస ఆదివాసీలు గత 15 ఏళ్లుగా పోడుసాగు చేసుకుంటున్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది రెండు రోజులుగా ట్రాక్టర్లతో దుక్కులు దున్నే ప్రయత్నం చేయగా పోడు సాగుదారులైన మహిళలు తీవ్రంగా అడ్డుకున్నారు. దాంతో కోపోద్రిక్తులైన అధికారులు, సిబ్బంది ఆ మహిళలపై బెల్టులు, కర్రలతో దాడి చేయగా పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రాజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థనాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ మహిళలపై దాడికి పాల్పడ్డ అధికారులు, సిబ్బందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఆదివాసీలు, అటవీశాఖ సిబ్బంది చండ్రు గొండ పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.  

Updated Date - 2022-06-27T09:24:02+05:30 IST