బ్రిస్బేన్ టెస్ట్.. ముగిసిన తొలిరోజు ఆట

ABN , First Publish Date - 2021-01-15T19:06:22+05:30 IST

గబ్బా వేదికగా ఆసీస్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి..

బ్రిస్బేన్ టెస్ట్.. ముగిసిన తొలిరోజు ఆట

బ్రిస్బేన్: గబ్బా వేదికగా ఆసీస్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్(28 నాటౌట్), టిమ్ పైన్(38నాటౌట్) ఉన్నారు. భారత బౌలర్లలో తొలి టెస్ట్ ఆడుతున్న నటరాజన్ 2 వికెట్లు తీసుకోగా, సిరాజ్, ఠాకూర్, సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.  


అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆసీస్ 87 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(01), మార్కస్ హారిస్(05) విఫలమయ్యారు. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆఖరి బంతికే వార్నర్ పెవిలియన్ చేరాడు. స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో నాలుగు పరుగులకే ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ హారిస్ కేవలం 5 పరుగులు చేసి శార్ధుల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 17 పరుగులకే ఆస్ట్రేలియా ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు.  


అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్, లుబుషేన్ జోడి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో స్మిత్ 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వాషింగ్టన్ సుందర్‌కు చిక్కాడు. సుందర్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి స్మిత్ ఔటయ్యాడు. ప్రమాదకరంగా మారిన మాథ్యూ వేడ్, లబుషేన్ జోడీని యువ బౌలర్ నటరాజన్ విడగొట్టాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న వేడ్‌‌ను(45) పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత సెంచరీ చేసి దూకుడు మీదున్న లబుషేన్‌ను నటరాజన్ అవుట్ చేశాడు. 108 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర నటరాజన్ బౌలింగ్‌లో పంత్ చేతికి లబుషేన్ చిక్కాడు. దీంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. 


 

Updated Date - 2021-01-15T19:06:22+05:30 IST