ఆస్ట్రేలియాలో కాలు పెట్టిన ఒమిక్రాన్..!
ABN , First Publish Date - 2021-11-28T21:57:08+05:30 IST
ఆస్ట్రేలియాలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కాలు పెట్టింది. దక్షిణాఫ్రికా నుంచి సిడ్నీ నగరానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు ఈ కొత్త వేరియంట్ బారినపడ్డట్టు ఆస్ట్రేలియా అధికారులు ఆదివారం ప్రకటించారు.
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కాలు పెట్టింది. దక్షిణాఫ్రికా నుంచి సిడ్నీ నగరానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు ఈ కొత్త వేరియంట్ బారినపడ్డట్టు ఆస్ట్రేలియా అధికారులు ఆదివారం ప్రకటించారు. న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం ఆరోగ్యశాఖ జరిపిన జీనోమ్ టెస్టింగ్లో ఈ విషయం బయటపడింది. ఈ ఇద్దరు ప్రయాణికులు శనివారం సిడ్నీకి వచ్చినట్టు సమాచారం. దీంతో.. ఆస్ట్రేలియాలో కలకలం రేగింది.
కాగా.. ఒమిక్రాన్ బారినపడ్డ ఆ ఇద్దరిలో ఎటువంటి కరోనా రోగలక్షణాలు లేవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వారు గతంలోనే కరోన టీకా తీసుకున్నట్టు పేర్కొన్నాయి. దోహా-సిడ్నీ విమానంలో వారు ఆస్ట్రేలియాకు వచ్చారు. వీరితో పాటూ మరో 12 మంది దక్షిణాఫ్రికా నుంచి సిడ్నీకి రాగా.. అధికారులు వారందరినీ క్వారంటైన్కు తరలించారు. కాగా.. ఆ విమానంలో వచ్చిన మొత్తం 260 మందిని కూడా ఐసోలేషన్లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. మరోవైపు.. ఐరోపా ఖండంలోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తుండటంతో అక్కడి దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై పటిష్ట ఆంక్షలకు తెరదీసాయి.