భారత విమానాలపై నిషేధం విధించిన ఆస్ట్రేలియా!

ABN , First Publish Date - 2021-04-27T16:54:57+05:30 IST

భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత విమానాలపై నిషేధం విధించిన ఆస్ట్రేలియా!

సిడ్నీ: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. మే 15 వరకు భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ఆసీస్ ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. ప్రస్తుతం మహమ్మారి కారణంగా ఇండియాలో దారుణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలియజేశారు. మోరిసన్ మాట్లాడుతూ.. అటు తమ దేశానికి వచ్చే భారతీయులకు, ఇటు తమ దేశం నుంచి ఇండియా వెళ్లే వేలాది మంది దేశ పౌరులకు ఈ నిర్ణయం తీవ్ర అంతరాయం కలిగిస్తుందని తెలుసు. కానీ, ప్రస్తుత పరిస్థితిలో ఇది తప్ప వేరే మార్గం లేదు. భారత విమానాలపై బ్యాన్ వల్ల చాలా మంది ఇరు దేశాల్లో చిక్కుకుపోవడం పట్ల తాము చింతిస్తున్నామన్నారు. కాగా, కరోనాతో పోరాడుతున్న భారత్‌కు తక్షణం ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు పంపుతామని ఆస్ర్టేలియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. భారత్‌లో మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా ఆరో రోజు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒకేరోజు 2,771 మంది కరోనాకు బలయ్యారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1.97 లక్షల మందిని కొవిడ్ కబళించగా.. కోటి 76 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 

   


Updated Date - 2021-04-27T16:54:57+05:30 IST