‘అరబిందో’కు పీఎల్‌ఐ ప్రయోజనాలు

ABN , First Publish Date - 2021-01-23T06:16:04+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అరబిందో ఫార్మా కొత్తగా రెండు బల్క్‌ డ్రగ్స్‌ యూని ట్లు ఏర్పాటు చేయనుంది.

‘అరబిందో’కు పీఎల్‌ఐ ప్రయోజనాలు

రూ.3,039 కోట్లతో కొత్త యూనిట్ల ఏర్పాటు


న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అరబిందో ఫార్మా కొత్తగా రెండు బల్క్‌ డ్రగ్స్‌ యూని ట్లు ఏర్పాటు చేయనుంది. పెన్సిలిన్‌ జీ, 7-ఏసీఏ, ఎరిత్రోమైసిన్‌ థియోసైనెట్‌ (టీఐఓసీ) అనే కీలకమైన బల్క్‌ డ్రగ్స్‌ తయారీ కోసం అరబిందో రెండు కొత్త యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్లకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఈ రెండు బల్క్‌ డ్రగ్స్‌ కోసం మన దేశం పూర్తిగా చైనా వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ పరిస్థితిని తప్పించేందుకు ఇలాంటి కీలకమైన బల్క్‌ డ్రగ్స్‌ను దేశీయంగా ఉత్పత్తి చేసే కంపెనీలను కేంద్ర ప్రభుత్వం పీఎల్‌ఐ పథకం కింద ప్రోత్సహిస్తోంది. కాగా ఈ రెండు బల్క్‌ డ్రగ్స్‌ ప్లాంట్ల కోసం అరబిందో ఫార్మా రూ.3,039 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.


ఇందులో 17,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసే పెన్సిలిన్‌ జీ, 7-ఏసీఏ ఉత్పత్తి ప్లాంట్‌ కోసం రూ.2,205 కోట్లు ఖర్చు చేస్తుంది. 1,600 మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటు చేసే టీఐఓసీ ప్లాంట్‌ కోసం మిగిలిన రూ.834 కోట్లు ఖర్చు చేస్తోంది. అరబిందో ఫార్మా ఈ రెండు కంపెనీలను లిఫియస్‌ ఫార్మా, క్యూలె ఫార్మా అనేక ప్రత్యేక కంపెనీల ద్వారా ఏర్పాటు చేస్తుంది. అరబిందో ఫార్మాతో పాటు కర్ణాటక యాంటీబయోటిక్స్‌ అండ్‌ ఫార్మా, కిన్వాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే రెండు కంపెనీలు ఏర్పాటు చేసే ప్రత్యేక బల్క్‌ డ్రగ్స్‌ తయారీ యూనిట్లకూ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎల్‌ఐ పథకం కింద ఆమోదం తెలిపింది. 

Updated Date - 2021-01-23T06:16:04+05:30 IST