విధులకు హాజరయ్యాడని కొట్టి చంపేశారు
ABN , First Publish Date - 2021-04-17T07:39:59+05:30 IST
ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విధులకు హాజరైన ఆర్టీసీ డ్రైవర్పై సమ్మె చేస్తున్న సిబ్బంది దాడికి పాల్పడడంతో అతడు చనిపోయాడు
ఆర్టీసీ డ్రైవర్పై సమ్మెచేస్తున్న సిబ్బంది దారుణం
బెంగళూరు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు విధులకు హాజరైన ఆర్టీసీ డ్రైవర్పై సమ్మె చేస్తున్న సిబ్బంది దాడికి పాల్పడడంతో అతడు చనిపోయాడు. కర్ణాటకలోని బాగల్కోటె జిల్లా జమఖండిలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. జమఖండి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ అవటి (46) విధులకు హాజరై డిపోనుంచి బస్సును బయటకు తీసి నడిపేందుకు ప్రయత్నించగా సమ్మె చేస్తున్న సిబ్బంది అడ్డుకున్నారు. బస్సు నుంచి ఒక్కసారిగా ఆయనను కిందకు లాగి కొట్టారు. అవటి కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందారు. ఈ ఘటన పట్ల రవాణాశాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.