కోట్ల విలువైన భూమి స్వాహాకు యత్నం!
ABN , First Publish Date - 2021-02-28T08:27:06+05:30 IST
కోట్లు విలువైన భూమిపై కొందరు కన్నేశారు. దానికి నకిలీ పత్రాలు సృష్టించారు. ఇక రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే తరువాయి.
శంషాబాద్: కోట్లు విలువైన భూమిపై కొందరు కన్నేశారు. దానికి నకిలీ పత్రాలు సృష్టించారు. ఇక రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే తరువాయి. సరిగ్గా ఈ దశలో అనుమానించిన సబ్-రిజిస్ట్రార్.. వాటిని పరిశీలించడంతో అవి నకిలీవని తేలింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అక్రమార్కుల పన్నాగం బెడిసికొట్టింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శంషాబాద్ సీఐ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టు నిర్వాసితుల కాలనీలో కోట్లాది రూపాయల విలువైన 360 గజాల భూమిని కొందరు నకిలీ పత్రాలతో స్వాహా చేసేందుకు యత్నించారు. ఎయిర్పోర్టు నిర్వాసితుల కాలనీకి చెందిన ప్లాట్నెంబర్ 484/1లో 360 గజాల స్థలానికి సంబధించి పట్టా సర్టిఫికెట్, ఇతరత్రా పలు డాక్యుమెంట్లు సబ్-రిజిస్ట్రార్కు సమర్పించారు. హైదరాబాద్లోని ప్రకాష్నగర్లో ఉండే అమృత అనే మహిళ బాగ్అంబర్పేట్కు చెందిన శ్రీనివాసశాస్ర్తికి అమ్మినట్లు ఆ పత్రాల్లో ఉంది. సాక్షిగా శంషాబాద్ సిద్ధాంతిబస్తీకి చెందిన సున్నంరాజు అనే వ్యక్తి సంతంకం చేసినట్టు ఉంది. అయితే.. ఈ డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీవని అనుమానించిన సబ్-రిజిస్ట్రార్ సిద్ధిఖి.. రిజిస్ట్రేషన్ ఆపేసి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ డ్యాకుమెంట్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నామని, ఆ నివేదిక రాగానే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.