పిఎఫ్ఐపై మరోసారి దాడులు!

ABN , First Publish Date - 2022-09-28T07:17:14+05:30 IST

దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ)పై మరోసారి దాడులు కొనసాగాయి.

పిఎఫ్ఐపై మరోసారి దాడులు!

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో సోదాలు.. 170 మందికిపైగా అరెస్టు 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: దేశవ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ)పై మరోసారి దాడులు కొనసాగాయి. ఎన్‌ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలు కలిసి ఆపరేషన్‌ ఆక్టోపస్‌ కింద మంగళవారం పీఎ్‌ఫఐ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. ఏడు రాష్ట్రాల్లో 170 మందికి పైగా పీఎ్‌ఫఐ కార్యకర్తలు, సభ్యులను అరెస్టు చేశాయి. ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ పీఎఫ్‌ ఐ కార్యాలయాలపై ఈ నెల 22న దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి 106 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల తర్వాత మంగళవారం ఢిల్లీ, అసోం, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌, నిజాముద్దీన్‌, జామియానగర్‌ ప్రాంతాల్లో దాడులు చేసి 30 మందికిపైగా పీఎ్‌ఫఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా జామియానగర్‌ ప్రాంతంలో నవంబరు 17 వరకు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల నిషేధాజ్ఞల నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ గుమిగూడవద్దని జామియా మిల్లియా వర్సిటీ కోరింది. కర్ణాటకలోని బీదర్‌, మంగళూరు, కోలార్‌, విజయ్‌పుర, బాగల్‌కోట్‌, చిత్రదుర్గ, బళ్లారి, చామరాజనగర్‌ సహా 13 జిల్లాల్లో పోలీసులు దాడులు నిర్వహించి 75 మందిని అదుపులోకి తీసుకున్నారు. అసోంలో గోల్‌పరా, కామరూప్‌, బర్పెట, ధుబ్రి, బగ్సా, దర్రాంగ్‌, ఉదల్‌గురి, కరీంగంజ్‌ జిల్లాల్లో సోదాలు చేసి, 25 మంది పీఎ్‌ఫఐ సభ్యులను అరెస్టు చేశారు. మహారాష్ట్ర పోలీసులు పుణెలో ఆరుగురు పీఎ్‌ఫఐ సభ్యులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ముంబ్రాలో మరో ఇద్దరిని అరెస్టు చేశారు. గుజరాత్‌లో 10 మందిని, మధ్యప్రదేశ్‌లో 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 10 మంది పీఎ్‌ఫఐ సభ్యులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా రెండోసారి పీఎ్‌ఫఐ సభ్యులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ సంస్థపై నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.


ముందు ఆరెస్సె్‌సను నిషేధించాలి: సీపీఎం

తీవ్రవాద సంస్థలు లేదా మతతత్వ శక్తులపై నిషేధం విధించిన మాత్రాన వాటి కార్యకలాపాలకు ముగింపు పలికినట్లు కాదని సీపీఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌ అన్నారు. అలాగైతే ముందు ఆరెస్సె్‌సనే నిషేధించాలని చెప్పారు. 


తెలంగాణలోనూ రెక్కీ!?

బీజేపీ జాతీయ సమావేశాల నేపథ్యంలో ఎన్‌ఐఏ ఆరా


హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో జూలైలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, విజయ సంకల్ప సభను టార్గెట్‌గా చేసుకుని రెక్కీ నిర్వహించారా అనే కోణంలో ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది. రాష్ట్రంలో జూలై 4న నిజామాబాద్‌లో పీఎ్‌ఫఐ కార్యకలాపాలు తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి. ఎన్‌ఐఏ ఆగస్టు 26న కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. పీఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తల్ని అరెస్ట్‌ చేయడానికి ముందే జరిగిన బీజేపీ సమావేశం, సభకు సంబంధించి ఇక్కడ ఏదైనా ప్లాన్‌ అమలు చేసే కుట్ర జరిగిందా అనే కోణంలో ఎన్‌ఐఏ ప్రత్యేక బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఇప్పటికే అరెస్టయి జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న వారిని కస్టడీకి అప్పగించాలంటూ ఎన్‌ఐఏ అధికారులు కోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎవర్ని టార్గెట్‌ చేశారు? ఎక్కడెక్కడ రెక్కీలు నిర్వహించారు? తదితర అంశాలపై వివరాలు రాబట్టేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధమవుతున్నాయి. మంగళవారం పీఎ్‌ఫఐ కేసులకు సంబంధించి తెలంగాణలోనూ సోదాలు జరిగాయన్న ప్రచారం జరిగినా, ఎన్‌ఐఏ వర్గాలు మాత్రం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. 

Updated Date - 2022-09-28T07:17:14+05:30 IST