అప్పు తీర్చాలని యువకుడిపై దాడికి యత్నం.. తండ్రి మృతి!
ABN , First Publish Date - 2021-07-10T14:23:58+05:30 IST
అప్పు తీర్చాలని ఓ వ్యక్తి మద్యంమత్తులో యువకుడిపై రాయితో దాడి చేయబోయాడు.
- అడ్డు వచ్చిన తండ్రికి గాయాలు..
- చికిత్స పొందుతూ మృతి
- నిందితుడి అరెస్టు
హైదరాబాద్ సిటీ/కొత్తపేట : అప్పు తీర్చాలని ఓ వ్యక్తి మద్యంమత్తులో యువకుడిపై రాయితో దాడి చేయబోయాడు. అడ్డువచ్చిన యువకుడి తండ్రికి గాయాలై ఆస్పత్రిలో మృతి చెందాడు. పోలీసులు నిందితుడి అరెస్టుచేశారు. వివరాలిలా ఉన్నాయి. నాగోల్, బండ్లగూడలో ఉండే కూరగాయల వ్యాపారి బల్ల ఆనందప్ప (55) కుమారుడు చంద్రశేఖర్(24), దిల్సుఖ్నగర్ గడ్డిఅన్నారంలో ఉండే టిల్లు, డ్రైవర్ తన్నీర్ రవి(24) స్నేహితులు. చంద్రశేఖర్ కొంత కాలం క్రితం తన్నీర్ రవి ద్వారా టిల్లు వద్ద రూ.10 వేలు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత చంద్రశేఖర్ రూ.8వేలు చెల్లించాడు. టిల్లుకు వడ్డీతో సహా ఇంకా రూ.5వేలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తరచూ టిల్లు, చంద్రశేఖర్ మధ్య గొడవ జరుగుతోంది. ఈ నెల 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు రవి మద్యం మత్తులో చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. రవి ఓ రాయితో అతడిపై దాడి చేసేందుకు యత్నించగా వారించబోయి, అడ్డుపడిన ఆనందప్ప తలకు గాయాలయ్యాయి. తర్వాత రవి వెళ్లిపోయాడు. ఆనందప్పను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. నిందితుడు రవిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ఎల్బీనగర్ ఎస్హెచ్ఓ అశోక్రెడ్డి తెలిపారు.