బంగ్లాదేశ్లో ఆలయాలపై దాడి
ABN , First Publish Date - 2021-10-15T07:27:30+05:30 IST
బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై ముస్లింలు దాడి చేశారు. దుర్గా పూజలు జరుగుతున్న సమయంలో వివిధ ఆలయాల్లోకి చొరబడి విగ్రహాలను..
విగ్రహాలను ధ్వంసం చేసిన ముస్లింలు
దుర్గా పూజలు జరుగుతుండగా ఘాతుకం
పోలీసు కాల్పుల్లో నలుగురి మృతి
ఢాకా, అక్టోబరు 14: బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై ముస్లింలు దాడి చేశారు. దుర్గా పూజలు జరుగుతున్న సమయంలో వివిధ ఆలయాల్లోకి చొరబడి విగ్రహాలను ధ్వంసం చేశారు. కోమిల్లా నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు, ఆ నగరం పొరుగున ఉన్న హాజీగంజ్, హాతియా, బంక్షాలీల్లో ఆలయాలపై దాడులకు పాల్పడ్డారు. అనంతరం జరిగిన ఘర్షణలో నలుగురు చనిపోయారని, పలువురు గాయపడ్డారని గురువారం ఆ దేశ మీడియా పేర్కొంది. అవాంఛిత సంఘటనలు జరగకుండా 22 జిల్లాల్లో పారామిలిటరీ బలగాలను, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ), సాయుధ పోలీసులను కూడా రంగంలోకి దింపామని ఆ దేశ హోం మంత్రిత్వశాఖ ప్రతినిధి తెలిపారు. మీడియా కథనాల ప్రకారం.. కోమిల్లా సరిహద్దు చాంద్పూర్లోని హాజీగంజ్లో బుధవారం విగ్రహాల విధ్వంసం జరిగిన తర్వాత ముస్లింల అల్లరిమూకలను అదుపు చేయడానికి పోలీసులు తరలివెళ్లారు. పరిస్థితి చేయి దాటిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయారని, పలువురు గాయపడ్డారని అధికారులు ధ్రువీకరించారు. అల్లర్లకు పాల్పడిన వారిలో 43 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆలయాలపై దాడులు చేసిన మతోన్మాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోమిల్లా దుర్గా పూజ కమిటీ కార్యదర్శి నిర్మల్ పాల్తోపాటు హిందూ సంస్థల నాయకులు కోరారు. దేశంలోని 10-12 చోట్ల హిందూ ఆలయాలపై దాడుల జరిగాయని అధికార అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి, రోడ్డు, రవాణా శాఖ మంత్రి ఒబైదుల్ ఖాదర్ తెలిపారు.