జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..
ABN , First Publish Date - 2021-06-11T09:03:50+05:30 IST
సరైన వైద్యం అందించడం లేదని ఆరోపిస్తూ స్టాఫ్నర్స్పై కరోనా బాధితుడి బంధువు దాడి చేసిన ఘటన నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది
నెల్లూరు జీజీహెచ్లో స్టాఫ్నర్సుపై దాడి
కరోనా బాధితుడి బంధువు దారుణం
నెల్లూరు (వైద్యం), జూన్ 10: సరైన వైద్యం అందించడం లేదని ఆరోపిస్తూ స్టాఫ్నర్స్పై కరోనా బాధితుడి బంధువు దాడి చేసిన ఘటన నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. నెల్లూరు నగరానికి చెందిన ఓ కరోనా బాధితుడు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకు సరిగా వైద్యం అందించడం లేదని ఆరోపిస్తూ బుధవారం తెల్లవారుజామున డ్యూటీలో ఉన్న నర్సుపై బాధితుడి కుటుంబసభ్యుడు వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమం లో ఆమెను జుట్టు పట్టుకుని కొంతదూరం లాక్కెళ్లాడు. పక్క నే ఉన్న కిటికీపై బలంగా గుద్దడంతో కిటికీ తలుపు పగిలింది. కాగా.. తనపై జరిగిన దాడిపై ఆ నర్సు సూపరింటెండెంట్ రాధాకృష్ణరాజుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసేందుకు సిద్ధమవగా.. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు.