రాహుల్ గాంధీ ఆఫీస్‌పై దాడి

ABN , First Publish Date - 2022-06-24T23:55:35+05:30 IST

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి జరిగింది. ఆయనకు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వయనాడ్‌లోని కార్యాలయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కాగా, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడి అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దాడికి పాల్పడింది..

రాహుల్ గాంధీ ఆఫీస్‌పై దాడి

తిరువనంతపురం: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి జరిగింది. ఆయనకు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వయనాడ్‌లోని కార్యాలయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కాగా, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడి అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దాడికి పాల్పడింది కేరళలోని అధికార పార్టీ సీపీఎంకు చెందిన విద్యార్థి విభాగం నేతలని, వారిని రెచ్చగొట్టి భయంకర దాడికి ఉసిగొల్పారని ఆరోపిస్తున్నారు. రాహుల్ కార్యాలయంలో కొంత మంది విధ్వంసం చేస్తూ కొట్టుకుంటూ ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ నేత, కేరళ ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీషన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘వయనాడ్‌‌లోని రాహుల్ గాంధీ కార్యాలయంపై ఎస్ఎఫ్ఐ గూండాలు భయంకర దాడికి పాల్పడ్డారు. ఇది చట్టవ్యతిరేకమైన చర్య, పూర్తిగా గూండాయిజం. సీపీఎం ఒక మాఫియా ఆర్గనైజేషన్‌లా మారిపోయింది. ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. 80-100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారని, వచ్చీ రావడంతోనే కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌ ధ్వంసం చేయడం ప్రారంభించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా ఎనిమిది మందిని కస్టడీలోకి తీసుకున్నారని స్థానిక అధికారి ఒకరు తెలిపారు.


మరొక వైపు మనీ లాండరింగ్ కేసులో కొద్ది రోజులుగా రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. ఇప్పటికి ఐదు రోజుల పాటు ఈడీ ముందు హాజరైన రాహుల్‌ను 50 గంటలకు పైగానే విచారించారు. అయితే గంటల తరబడి విచారించినా రాహుల్ ఏమాత్రం ఏమాత్రం విసుగువిరామం లేకుండా ఎంతో ఓర్పుగా, సహనంగా ఉండటం చూసి ఈడీ అధికారులు ఆశ్చర్యపోయారట. ఈడీ మారథాన్ సెషన్‌ను తాను ఏ విధంగా ఎదుర్కొన్నాననే విషయాన్ని, తన ఓర్పుకు అసలు కారణాన్ని రాహుల్ గాంధీ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ గుర్తుచేసుకున్నారు.

Updated Date - 2022-06-24T23:55:35+05:30 IST