మాదాపూర్లో హిజ్రాపై పెట్రోలు పోసి నిప్పంటించిన మరో వర్గం!
ABN , First Publish Date - 2020-10-13T02:02:03+05:30 IST
హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రెండు హిజ్రా వర్గాల మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో జరిగిన ఈ గొడవ కాస్త పెట్రోలు పోసి తగలబెట్టుకునే స్థితికి వెళ్లింది. మాదాపూర్ పీఎస్ పరిధిలో ఓ హిజ్రాపై మరో హిజ్రా వర్గం పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన హైదరాబాద్లో తీవ్ర సంచలనమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగింది..!?
పూర్తి వివరాల్లోకెళితే.. ఎర్రగడ్డ అవంతి నగర్కు చెందిన హరి ప్రసాద్ అలియాస్ హంస (28)కు ఇటీవల చందానగర్లో నివాసం ఉంటున్న కొంతమంది హిజ్రాలతో విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి హైటెక్ రైల్వే స్టేషన్ సమీపంలో మాట్లాడుకుందామని హంసకు సమాచారం అందించారు. ఈ గొడవకు ఇక్కడితో ఫుల్స్టాప్ పెట్టేయాలని భావించిన హంస పిలవగానే రైల్వే స్టేషన్ దగ్గరికెళ్లింది. హంస ఒక్కటే రావడంతో అటువైపున్న మరో వర్గం వారు ఆమెను పట్టుకుని పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు. ఈ ఘటనలో హంసకు తీవ్రగాయాలయ్యాయి.
మంటల్లో కాలుతున్న హంసను గమనించిన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ హంస ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆస్పత్రిలోనే హంస చికిత్స పొందుతోంది. హంస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.