దాడి దుర్మార్గం

ABN , First Publish Date - 2022-01-22T08:57:34+05:30 IST

Attack is evil

దాడి దుర్మార్గం

  • కేసినో నానిని సీఎం బర్తరఫ్‌ చేయాలి
  • లేకపోతే జగన్‌ చీటీ చిరగడం ఖాయం
  • అసలు డీజీపీ ఏంచేస్తున్నారు?
  • మంత్రిని అరెస్టు చేయాలి.. తెలుగుదేశం నేతల డిమాండ్‌


అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కేసినో నానిని మంత్రివర్గం నుంచి తక్షణం బర్తరఫ్‌ ఛేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. కేసినో బ్యాచిని వెనకేసుకొని వచ్చి చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి చీటీ చిరగడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ‘‘గుడివాడ కేసినో నిర్వహణ గుట్టు విప్పడానికి వెళ్లిన టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులపై వైసీపీ గుట్కా బ్యాచి దాడి దుర్మార్గం. అసలు తప్పే జరగలేదని వాదిస్తున్నప్పుడు టీడీపీ నేతలను అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి? కేసినో గుట్టు బయట పడుతుందనే అంతలా వీరంగం వేశారు. వీడియోలతో సహా బయట పెట్టినా పోలీసులు కేసినోపై ఏ చర్యలూ తీసుకోలేదు’’ అని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలపై దాడి ఘటనలో మంత్రి, అతని అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి నాని వంటి సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యమంత్రి సిగ్గుపడాలని మాజీ మంత్రి, టీడీపీ నేత నిమ్మకాయల చిన రాజప్ప ఆగ్రహించారు. రాష్ట్రంలో దళితులపై అనేక దాడులు జరిగితే ఏనాడూ నోరు మెదపని మంత్రి కొడాలి నానికి కేసినో వ్యవహారంలో రక్షణ కోసం దళితులు గుర్తుకు వచ్చారని మాజీ మంత్రి, టీడీపీ నేత కేఎస్‌ జవహర్‌ విమర్శించారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటన అడ్డుకోవడం కోసం అకస్మాత్తుగా దళితులతో సమావేశం ఏర్పాటు చేశారన్నారు. 


ఇది గడ్డం గ్యాంగ్‌ పనే: లోకేశ్‌ 

ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే గడ్డం గ్యాంగ్‌ క్యాసినో నడిచిందనేది టీడీపీ నేతలపై దాడితో తేలిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి దౌర్జన్యంగా పోలీసులు ప్రవేశించడాన్ని, నిజ నిర్ధారణకు వెళ్లిన పార్టీల నేతల బృందంలోని బోండా ఉమ కారుపై వైసీపీ కార్యకర్తల దాడిని ఆయన ఖండించారు. కేసినో నడిపి ప్రజల నుంచి రూ. వందలకోట్లు కాజేసిన గడ్డం గ్యాంగ్‌ని వదిలి నిజ నిర్దారణకు వెళ్లిన పార్టీ నేతల్ని పోలీసులు అరెస్టు చేయడం గర్హనీయమన్నారు. గుడివాడను గోవా..డగా మార్చేసిన అసలు సూత్రధారులపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. 


కొడాలి నోరు పారేసుకుంటే సహించేదిలేదు: బుద్దా 

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. తమ పార్టీని ఇబ్బంది పెట్టాలనే విధంగా సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని, ఇందులో భాగంగానే మంత్రి కొడాలి నాని లాంటి వ్యక్తులతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని తిట్టిస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని గుడివాడలో కేసినో ఆడించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అమాయక ప్రజల నుంచి రూ.200 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ గుడివాడకు వెళితే దాడులు చేయిస్తారా? అంటూ ధ్వజమెత్తారు. మంత్రి కొండాలి నానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని, చంద్రబాబుపై నోరు పారేసుకుంటే సహించమని, టీడీపీ కార్యకర్తలు విశ్వరూపం చూపిస్తారని హెచ్చరించారు. ఇక తమకు కూడా ఓర్పు, సహనం నశించాయని, టీడీపీ అధికారంలోకి వచ్చే వరకు ఆగాల్సిన పని లేదని, వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కొడాలి నాని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బుద్దా వెంకన్న హెచ్చరించారు.  

Updated Date - 2022-01-22T08:57:34+05:30 IST