భూ వివాదంలో తహసీల్దార్పై దాడి
ABN , First Publish Date - 2021-10-19T05:44:39+05:30 IST
యడ్లపాడు గ్రామ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించిన విషయంలో అదే గ్రామానికి చెందిన గోనుగుంట్ల క్రాంతికుమార్ తహసీల్దార్ శ్రీనివాసరావుపై సోమవారం సాయంత్రం దాడికి పాల్పడ్డాడు.
యడ్లపాడు, అక్టోబరు 18: యడ్లపాడు గ్రామ పరిధిలో ఓ భూ వివాదానికి సంబంధించిన విషయంలో అదే గ్రామానికి చెందిన గోనుగుంట్ల క్రాంతికుమార్ తహసీల్దార్ శ్రీనివాసరావుపై సోమవారం సాయంత్రం దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పి.రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... యడ్లపాడుకు చెందిన గోనుగుంట్ల తిరుపతిరావు, గోనుగుంట్ల చిన్నతిరుపతిరావు అన్నదమ్ములు. వీరికి సోదరి కల్లూరి సుబ్బాయమ్మ ఉన్నది. తిరుపతిరావుకు సంతానం లేదు. కొన్నేళ్ల క్రితం తిరుపతిరావు మరణించాడు. ఆయనకు చెందిన 53సెంట్ల భూమికి సంబంధించి కుమారుడు క్రాంతికుమార్కు, సుబ్బాయమ్మ కుమారుడు కల్లూరి చిన్నశ్రీరాముల మధ్య వివాదం నెలకొంది. ఆ భూమికి తనకే చెందుతుందని క్రాంతికుమార్ తనపేర నమోదు చేయాలని తహసీల్దార్కు కొద్దిరోజుల కిందట దరఖాస్తుచేశాడు. ఈ విషయమై తహసీల్దార్ను కలసినప్పటికీ రికార్డుల్లో చిన్న శ్రీరాములు పేరు నమోదయి ఉందని తానేమీ చేయలేనని న్యాయపరంగా తేల్చుకోవాలని సూచిస్తూ వచ్చారు. సోమవారం సాయంత్రం మరోసారి కలవగా ఇదే విషయం చెప్పడంతో ఆగ్రహానికి గురైన క్రాంతికుమార్ తహసీల్దార్పై చేయిచేసుకున్నాడు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్రాంతికుమార్ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.