నరకప్రాయం..!

ABN , First Publish Date - 2021-02-27T06:25:26+05:30 IST

ఈ ఫొటోల్లోని విద్యార్థినుల అవస్థలు చూశారా.. విపరీతమైన ఎండ.. భరించలేనంత వేడి.. కూర్చుందామంటే కుర్చీల్లేవ్‌. నిల్చుందామంటే నీడ కూడా లేదు.

నరకప్రాయం..!
కౌన్సెలింగ్‌ కోసం బారులు తీరిన విద్యార్థినులు

ఈ ఫొటోల్లోని విద్యార్థినుల అవస్థలు చూశారా.. విపరీతమైన ఎండ.. భరించలేనంత వేడి.. కూర్చుందామంటే కుర్చీల్లేవ్‌. నిల్చుందామంటే నీడ కూడా లేదు. మండుటెండలోనే ఇలా గంటల తరబడి విద్యార్థినీవిద్యార్థులు క్యూలో నిలబడాల్సి వచ్చింది. కొందరు చున్నీలు తదితరాలతో సూర్యుడి ప్రతాపం నుంచి రక్షణ పొందేందుకు ప్రయత్నించినా.. అవేవీ పనిచేయలేదు. కనీసం తాగటానికి నీరు కూడా లేక ప్రత్యక్ష నరకం అనుభవించారు. నీరు కూడా లేనపుడు ఇక ఏం ఏర్పాట్లు చే సినట్లు అంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి చాలవన్నట్లు తోపులాట జరిగింది. పోలీసు భద్రత నడుమ ఎస్కేయూలో ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. 

    బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌కు వందల సంఖ్యలో విద్యార్థులు హాజరవటంతో తోపులాట జరిగింది. శుక్రవారం ఎస్కేయూ అడ్మిషన్ల కార్యాలయంలో ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరవటంతో కౌన్సెలింగ్‌లో గందరగోళం ఏర్పడింది. కనీస సౌకర్యాలు కల్పించటంలో ఎస్కేయూ యంత్రాంగం విఫలమైందని విద్యార్థులు వాపోయారు. తాగడానికి నీరు కూడా లేదని విద్యార్థినులు పేర్కొన్నారు. ఒకటి నుంచి 4000వ ర్యాంకు వరకూ పిలవగా.. వెయ్యిమంది సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై తోపులాట జరగడంతో ఇటుకలపల్లి ఎస్‌ఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. శనివారం 4001 నుంచి 8వేల ర్యాంకు వరకూ కౌన్సెలింగ్‌ నిర్హహించనున్నారు.

(అనంతపురం, ఫిబ్రవరి26)



Updated Date - 2021-02-27T06:25:26+05:30 IST