హోంగార్డు ఉద్యోగాల పేరుతో టోకరా
ABN , First Publish Date - 2021-01-23T06:49:02+05:30 IST
హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.లక్షల్లో నిరుద్యోగులకు టోకరా వేసిన ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్
జిల్లాతోపాటు కర్నూలు జిల్లాలో బాధితులు
ఒక సీపీయూ, హార్డ్ డిస్క్, కంప్యూటర్, రెండు సెల్ఫోన్లు,
నకిలీ నియామకపత్రాలు స్వాధీనం
అనంతపురం క్రైం, జనవరి 22: హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.లక్షల్లో నిరుద్యోగులకు టోకరా వేసిన ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ముఠా సభ్యులైన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక సీపీయూ, హార్డ్ డిస్క్, కంప్యూటర్, రెండు సెల్ఫోన్లు, నకిలీ నియామకపత్రాలు స్వాధీనం చేసు కున్నారు. జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు అదనపు ఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ విజయభాస్కర్ గౌడ్లతో కలిసి స్థానిక పోలీసు కాన్ఫరెన్స్హాల్లో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన తొక్కల సాయికిరణ్ కొన్నేళ్లుగా అక్కడే ఫొటో స్టూడియో నిర్వహిస్తుండేవాడు. రెండేళ్ల కిందట రవి అనే వ్యక్తి తనది కడప జిల్లా అని చెప్పి సాయికిరణ్తో పరిచయం పెంచుకున్నాడు. ఈక్రమంలో హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని సాయికిరణ్ను నమ్మించాడు. అంతటితో ఆగకుండా అతడిని హైదరాబాద్కు తీసుకెళ్లి అక్క డ ఓ ఆనామకుడిని రిటైర్డు డీఐజీ అని చెప్పి పరిచయం చేశాడు. తర్వాత అడ్వాన్స్గా రూ. 30 వేలు చెల్లించాలని, ఉద్యోగం వచ్చిన తరువాత రూ. 2.5 లక్షలు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో రవి చెప్పిన విధంగా నరసింహ అనే వ్యక్తి అకౌంట్ కు అడ్వాన్స్గా రూ.30 వేలు సాయికిరణ్ ట్రాన్స్ఫర్ చేశాడు. అలాగే తన స్నేహితులైన కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన షేక్షావలి ద్వారా మరో నలుగురు నిరుద్యోగ యువకులతో రూ. 90 వేలు కట్టించాడు. ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించి నెలలు గడిచినా రవి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో మోసపోయానని సాయికిరణ్ భావించాడు. ఒకవైపు హోంగార్డు ఉద్యోగాలు రాక, మరో వైపు స్నేహితులతో కట్టించిన డబ్బులు వెనక్కి ఇవ్వలేక దిక్కుతోచని పరిస్థితిలో సాయికిరణ్ కూడా ఇదే తరహా మోసాలకు తెరలేపాడు. గ తంలో మాదిరిగానే మరోసారి షేక్షావలి ద్వారా 40 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు చొప్పున రూ. 12 లక్షలు వసూలు చేసి జల్సా చేశాడు. తర్వాత అనంతపురం జిల్లా లో ఉన్న చిన్ననాటి స్నేహితుడైన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మం డలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన డేరంగుల వెంకటేష్ ద్వారా నార్పల ప్రాంతానికి చెందిన రవి, రఫీ, వేణుగోపాల్, బండి శ్రీకాంత్, సీకేపల్లికి చెందిన సాయికుమార్రెడ్డి నుంచి రూ. 22.67 లక్షలు కట్టించుకున్నాడు. ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించిన వారిలో ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా నకిలీ పత్రాలు సృష్టించాడు. వాట్సాప్ ద్వారా నకిలీ డిస్టిక్ కన్ఫర్మేషన్, స్టేషన్ కన్ఫర్మేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ల కు సంబంధించిన ధ్రువపత్రాలను అభ్యర్థులకు పంపేవాడు. ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే తన స్నేహితుడైన ఇరిగేషన్ శాఖలో లస్కర్గా పనిచేస్తున్న కర్నూలు జిల్లా నొస్సం గ్రామానికి చెందిన చక్కెర వెంకట సుబ్బయ్యతో నకిలీ పోలీసు అవతారం ఎత్తించి నమ్మించేవాడు. హోంగార్డు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి నెలలు గడిచినా ఉద్యోగాలు ఇప్పించకపోవడం, సరైన స్పందన రాకపోవడంతో జిల్లాకు చెందిన బాధితులు నార్పల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుట్టురట్టైంది. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి నేతృత్వంలో ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్గౌడ్, నార్పల ఎస్ఐ ఇబ్రహీం, ఆర్ఎ్సఐ రాజశేఖర్రెడ్డి, కానిస్టేబుళ్లు ఎర్రిస్వామి, మురళి, మధు, జగదీష్ తదితర సిబ్బంది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. ముగ్గురు నిందితులు డేరం గుల వెంకటేష్, తొక్కల సాయికిరణ్, చక్కెర వెంకట సుబ్బయ్య నాయనపల్లిక్రా్సలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మోసగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు. మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. హోంగార్డు, తదితర ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు వ సూలు చేసే మోసగాళ్ల మాటలు నమ్మకుండా నిరు ద్యోగ యువతీయువకులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.