ఏటీఎం మోసగాడి అరెస్టు
ABN , First Publish Date - 2022-06-30T06:25:50+05:30 IST
ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం తెలియని వ్యక్తిని మోసగించిన ఓ యువకుడు చివరకు కటకటాలపాలయ్యాడు.
శాంతిపురం, జూన్ 29: ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం తెలియని వ్యక్తిని మోసగించిన ఓ యువకుడు చివరకు కటకటాలపాలయ్యాడు. రాళ్లబూదుగూరు పోలీసుల కథనం మేరకు... తుమ్మిశి పంచాయతీ బుడదసిద్దనపల్లెకు చెందిన మారప్ప శాంతిపురం పట్టణంలోని ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వచ్చాడు. ఏటీఎంలో డబ్బు తీసుకోవడం తెలియని ఆయన అక్కడే ఉన్న యువకుడికి పిన్ నెంబర్ చెప్పి రూ.1000డ్రా చేసుకున్నాడు. సాయం చేసిన ఆ యువకుడు మారప్ప ఏటీఎం కార్డును తన వద్దే ఉంచుకుని, తన వద్ద ఉన్న వేరే కార్డును ఇచ్చాడు. మారప్ప అక్కడికి నుంచి వెళ్లిపోగానే ఆ యువకుడు రూ.27,300 డ్రా చేసుకున్నాడు. ఇది గుర్తించిన మారప్ప రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ మునస్వామి కేసు దర్యాప్తును ముమ్మరం చేశాడు. మంగళవారం సాయంత్రం యువకుడు శాంతిపురం యూనియన్ బ్యాంకు ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా ఉండటంతో స్టేషనుకు తరలించి విచారణ జరిపారు. మారప్ప ఏటీఎం కార్డు నుంచి తానే డబ్బు డ్రా చేసినట్టు యువకుడు అంగీకరించాడు. అతని నుంచి రూ.27,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. యువకుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు.