అశోక్‌బాబును అర్దరాత్రి దొంగల్లా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటి? : అచ్చెన్న

ABN , First Publish Date - 2022-02-11T13:37:15+05:30 IST

ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం రాత్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే..

అశోక్‌బాబును అర్దరాత్రి దొంగల్లా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటి? : అచ్చెన్న

అమరావతి : ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం రాత్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై ఆయన్ను విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన అరెస్ట్‌ను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు తమ్ముళ్లు మీడియాతో మాట్లాడగా.. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన రూపంలో స్పందించారు. అబద్దపు పునాదుల మీద అధికారాన్ని చేపట్టిన జగన్ రెడ్డి.. అరాచకంతో పాలన సాగిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ వైఫల్యాలు, తప్పుల్ని పశ్నించిన టీడీపీ నేతల్ని అక్రమ కేసులు, అర్దరాత్రి అరెస్టులతో ‎వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


అర్ధరాత్రి అరెస్టా.. ఏంటిది..!?

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేయటాన్ని ఖడిస్తున్నాం. అశోక్ బాబును అర్దరాత్రి దొంగల్లా వచ్చి అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి?. గతంలో అశోక్ బాబుపై వచ్చిన ఆరోపణలపై ఆయన ప్రమేయం లేదని విచారణలో తేలినా కుట్రపూరితంగా మళ్లీ కేసు పెట్టడం జగన్ రెడ్డి అరాచక పాలనకు అద్దం పడుతోంది. ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడుగా అశోక్ బాబు.. వైసీపీ ప్రభుత్వం పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు చేసిన మోసం, అన్యాయంపై  ఉద్యోగుల్ని చైతన్యవంతం చేస్తున్నాడన్న కడుపుమంటతోనే ఆయనపై కక్ష్యసాధిస్తున్నారు. అక్రమ కేసులకు భయపడేవారెవరూ టీడీపీలో లేరు. అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలి. జగన్ రెడ్డీ.. ఇకనైనా పద్దతి మార్చుకుని పాలన సాగించాలి.. లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదుఅని అచ్చెన్న వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటి వరకూ ఈ అరెస్ట్ వ్యవహారంపై వైసీపీ నేతలు మాట్లాడలేదు.

Updated Date - 2022-02-11T13:37:15+05:30 IST