మీరు రిటైర్ అయినా వదలం.. భరతం పడతాం: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-01-21T21:22:17+05:30 IST

పోలీసుల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మీరు రిటైర్ అయినా వదలం.. భరతం పడతాం: అచ్చెన్న

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొందరి పోలీసుల తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీసులకు బుర్ర లేదన్నారు. ప్రభుత్వం ఏం చెబితే అది కేసు రాయడం, అరెస్టు చేయడమే తెలుసునని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోవాలని, ఆలోచనతో పనిచేయాలని సూచించారు. వంటిపై వేసుకున్నది ఖాకీ డ్రస్ అని, వైసీపీ జండా కాదని తెలుసుకోవాలన్నారు. పోలీసులే ఈ రకంగా వ్యవహరిస్తే ఇక రాష్ట్రం ఎలా బాగుపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టే సమస్యలేదని, నాయకులు, అధికారులు ఎవరినైనా వదిలిపెట్టేది లేదని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు రిటైర్ అయినా, ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదని, అలాగని అన్యాయంగా ఎవరినీ ఇబ్బందిపెట్టమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని, ఎవరినీ విడిచిపెట్టేదిలేదని అచ్చెన్నాయుడు మరోసారి హెచ్చరించారు.

Updated Date - 2021-01-21T21:22:17+05:30 IST