అచ్చెన్నపై పూర్తిస్థాయి విచారణ: మంత్రి ధర్మాన
ABN , First Publish Date - 2020-02-22T09:50:58+05:30 IST
అచ్చెన్నపై పూర్తిస్థాయి విచారణ: మంత్రి ధర్మాన
గుజరాతీపేట(శ్రీకాకుళం), ఫిబ్రవరి 21: ఈఎ్సఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోలులో భారీ కుంభకోణానికి కార్మిక శాఖ మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు తెరలేపారని.. ఆయనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఏ తప్పూ చేయలేదని చెబుతున్న అచ్చెన్నాయుడు తన వారికి నామినేషన్ పద్ధతి లో కాంట్రాక్టు కట్టబెట్టాలంటూ సిఫారసులు ఎందుకిచ్చారో చెప్పాలని శుక్రవా రం డిమాండ్ చేశారు. రూ.5 లక్షలకు ఏవి కొనాలన్నా టెండర్లు పిలవాలన్న సంగతిని పక్కనబెట్టి.. నచ్చినవారికి పనులను అప్పగించారని ఆరోపించారు. ఇలా రూ.900 కోట్ల పైగా ప్రజాధనాన్ని టీడీపీ హయాంలో దోచుకున్నారని మండిపడ్డారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో ఈ స్కాం బట్టబయలైందని.. అర్హతలు లేని ఏజెన్సీల నుంచి మందులు కొనుగోలు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారని స్పష్టమైందని తెలిపారు. టెలీహెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చి భారీగా లబ్ధి పొందారని అన్నారు. ఈఎ్సఐలో నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారని చెప్పారు. మాజీ మంత్రికి సహకరించిన వారిపైనా చర్యలుంటాయని తెలిపారు.