అమెరికాలో ATA ఉత్సవాలు.. భారీగా తరలివస్తున్న భారతీయ ప్రముఖులు..!
ABN , First Publish Date - 2022-07-02T01:59:48+05:30 IST
జులై 1 నుండి 3 తేదీలలో వాషింగ్టన్ డీసీ వేదికగా జరుగుతున్న 17వ ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి ఇండియా నుండి అమెరికా చేరుకుంటున్న ప్రత్యేక అతిథులతో వాషింగ్టన్ డీసీ కళకళలాడుతుంది.
వాషింగ్టన్ నుండి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు ముద్దు కృష్ణ: జులై 1 నుండి 3 తేదీలలో వాషింగ్టన్ డీసీ వేదికగా జరుగుతున్న 17వ ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి ఇండియా నుండి అమెరికా చేరుకుంటున్న ప్రత్యేక అతిథులతో వాషింగ్టన్ డీసీ కళకళలాడుతుంది. సద్గురు జగ్గీ వాసుదేవ్, మాజీ క్రికెటర్లు గవాస్కర్, కపిల్ దేవ్, క్రిస్ గేల్, హీరో అడవి శేష్, నటి రకుల్ ప్రీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ టీం, గాయకులు శ్రీకృష్ణ, సునీత, మనీషా ఈరభతిని, మంగ్లీ, గీత రచయితలు చంద్రబోస్, రామజ్యోగయ శాస్త్రి, శేఖర్ మాస్టర్, పద్మశ్రీ పద్మజ, కూచిపూడి కళాకారుల బృందం, తనికెళ్ల భరణి గారు, ఉపాసన కొణిదెల, యాంకర్లు శ్రీముకి, రవి, ఇల్యూషనిస్ట్ బి ఎస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ లీడర్ కుసుమ జగదీశ్వర్, మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్, మిమిక్రీ ఆర్టిస్ శివా రెడ్డి, కూచిపూడి గురువు డా. హలీంఖాన్తో పాటుగా రాజకీయ నాయకులు, కళాకారులు ఇప్పటికే వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. భారతీయ ప్రముఖులకు ఆటా టీం ఘన స్వాగతం పలికారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ భూజాల, కన్వీనర్ సుధీర్ బండారు, స్వయంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి అతిథులకు స్వాగతం పలుకుతున్నారు.
శుక్రవారం నుండి ఆదివారం వరకు జరిగే వేడుకల కోసం వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ ముస్తాబయింది. అమెరికా నలుమూలాల నుండి తెలుగు వారు హజరవుతున్న ఈ వేడుకలు శుక్రవారం ఉదయాన్నే గోల్ఫ్ టోర్నమెంట్, యూత్ క్రికెట్ టోర్నమెంట్తో ప్రారంభం అయ్యాయి. సద్గురు, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, నటి రకుల్ ప్రీత్, సతీష్ తీగల గోల్ఫ్ టోర్నమెంట్లో పాల్గొని సందడి చేస్తున్నారు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ యూత్ క్రికెట్ టోర్నమెంట్కి అతిథులుగా హాజరవుతున్నారు. శుక్రవారం సాయంత్రం జరగబోయే బాంక్వెట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఈ డిన్నర్కి అతిథులు అందరూ హాజరు కానున్నారు.