ఇండియా టోయ్‌ ఫెయిర్‌లో.. సిక్కోలుకు సముచిత స్థానం

ABN , First Publish Date - 2021-03-04T05:24:52+05:30 IST

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా టోయ్‌ ఫెయిర్‌-2021 పోటీల్లో జిల్లాకు సముచిత స్థానం లభించింది.

ఇండియా టోయ్‌ ఫెయిర్‌లో.. సిక్కోలుకు సముచిత స్థానం
ఉపాధ్యాయులను ప్రశంసిస్తున్న విద్యాశాఖ కమిషనర్‌

నందిగాం, మార్చి 3: నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా టోయ్‌ ఫెయిర్‌-2021 పోటీల్లో జిల్లాకు సముచిత స్థానం లభించింది. ఫిబ్రవరి 27 నుంచి నాలుగురోజుల పాటు వర్చువల్‌ విధానంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో జిల్లా నుంచి ఆరుగురు ఉపాధ్యాయులు ఎంపికై సత్తా చాటారు. చిలుకు కృష్ణారావు (జడ్పీహెచ్‌ఎస్‌- లఖిదాసుపురం), మూల తాతయ్య (గిరిజన సంక్షేమ పాఠశాల- కిల్లోయి), రేజేటి వెంకటరమణ (యూపీ స్కూల్‌- భగవాన్‌పురం), ఎన్‌.కృష్ణారావు (జడ్పీహెచ్‌ఎస్‌- తలగాం), ఎ.అనంతలక్ష్మి (కేజీబీవీ- పొన్నాడ), ఎస్‌.నాగవల్లి (కేజీబీవీ- పోలాకి) పోటీల్లో పాల్గొని దివ్యాంగుల సరదాల బండి, కాశీపట్నం చూదమురండి ప్రదర్శన పెట్టి తదితర అంశాలను తయారుచేసి గుర్తింపు పొందారు. విద్యాశాఖ కమిషనర్‌ చిన్నవీరభద్రుడు, స్కెప్ట్‌ డైరెక్టర్‌ ప్రతాపరెడ్డి తదితరులు వీరిని అభినందించారు. ఈ ప్రాజెక్ట్‌ జాతీయస్థాయి ప్రదర్శనలో ఎంపికైందని రాష్ట్ర నోడల్‌ అధికారి తెలిపినట్లు పాల్గొన్నవారు తెలిపారు. ఉపాధ్యాయుల ఎంపికపై జిల్లా విద్యాశాఖా ధికారి చంద్రకళ, ఆర్‌ఎంఎస్‌ఏ ఉపవిద్యాశాఖాధికారి ఆర్‌.తిరుపతిరావు, ఉపవిద్యాశాఖాధికారులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-04T05:24:52+05:30 IST